సమ్మర్ వచ్చిందంటే ఆ కళే వేరు.. ప్రతి ఊరిలో, వాడలో కనీసం ఒక్క ఇంటనైనా పెళ్లిబాజా మోగుతుంది. బంధువులతో ఇళ్లు కళకళలాడుతాయి. బ్యాండ్ బాజా బరాత్ అంటూ.. ఆర్కేస్ట్రాలు హోరెత్తిస్తాయి. డీజేలు డీటీఎస్ లో దుమ్ములేపుతాయి. డ్యాన్సులతో యూత్ సందడి చేస్తుంది. ఇది ప్రతిఏటా జరిగే పెళ్లిసంబరం.
కానీ.. రెండేళ్లుగా పరిస్థితి మొత్తం మారిపోయింది. గత సమ్మర్ మొత్తం లాక్ డౌన్ తో తుడిచిపెట్టుకుపోయింది. ఈ సారైనా పెళ్లిళ్లు చేయాలని ఆశించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రపంచంలో ఏ దేశమూ చూడనటువంటి విపత్తును.. భారత్ లో కలిగిస్తోంది సెకండ్ వేవ్. దీంతో.. అనివార్యంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 4 లక్షల 12 వేల 262 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,449 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు కేసులు.. అటు మరణాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందే తప్ప, తగ్గట్లేదు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ, కర్నాటక, హర్యానా వంటి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఏపీ వంటి రాష్ట్రాల్లో మినీ లాక్ డౌన్ అమలవుతోంది. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లోనే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. మొత్తానికి ఏ రాష్ట్రంలోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అయితే.. కేసులు గణనీయంగా పెరుగుతున్న రాష్ట్రాలు మాత్రం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా.. రాజస్థాన్ ప్రభుత్వం కంప్లీట్ షట్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ నెల 10వ తేదీ నుంచి 24 వరకు కొనసాగనున్నట్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల విషయంలోనూ కఠిన నిబంధనలు పాటించాలని సూచించింది. ఖచ్చితంగా పెళ్లిచేయాల్సిన అవసరం ఉంటే.. కేవలం రెండు కుటుంబాల సభ్యులు, ఓ పురోహితుడు కలిసి మొత్తం 11 మంది మాత్రమే పెళ్లిలో ఉండాలని, సింపుల్ గా ఇంట్లో జరిపించుకోవాలని ఆదేశించింది. ఇదిలాఉంటే.. రాజస్థాన్ లో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. నంబర్ విషయంలోనే తేడా!