Homeజాతీయ వార్తలుGnanavapi : నాడు అయోధ్య విషయంలో జరిగిందే.. నేడు జ్ఞానవాపిలోనూ జరుగుతుందా?

Gnanavapi : నాడు అయోధ్య విషయంలో జరిగిందే.. నేడు జ్ఞానవాపిలోనూ జరుగుతుందా?

Gnanavapi : ఇప్పటికే అయోధ్య లో రామ మందిరం నిర్మాణమైంది. బాల రాముడు ప్రాణ ప్రతిష్ట చేసుకున్నాడు. ఇది మరవకముందే మరో వివాదాస్పద మసీదు జ్ఞానవాపి కేసు విషయంలో బుధవారం సంచలనం నమోదయింది. ఈ మసీదుకు సంబంధించి హిందూ సంఘాలు చెబుతున్నట్టే కోర్టు తీర్పు ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది. ఇదివరకే ఏఎస్ఐ సర్వే నివేదికలో ఆశ్చర్యపోయే నిజాలు బయటికి వచ్చాయి. తాజాగా జ్ఞానవాపీ మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని బుధవారం వారణాసి కోర్టు తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా సంచలనం నమోదయింది. అంతేకాదు ఆ మసీదులో పూజలకు వెంటనే ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించడం విశేషం. ఇప్పటివరకు సీజ్ చేసిన పది సెల్లార్లలో హిందూ దేవతలకు సంబంధించిన ప్రతిమలకు పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.

వారణాసి కోర్టు తీర్పు నేపథ్యంలో పూజలు ప్రారంభిస్తామని కాశి విశ్వనాధ్ ట్రస్ట్ ప్రకటించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ఈ కేసు పై స్పందించారు. “కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వారణాసి కోర్టు అత్యంత చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది.. ఇది హిందువులకు శుభదినం.” అని పేర్కొన్నారు. ప్రభుత్వ సమ్మతి కోసం తాము ఆర్డర్ కాపీని జిల్లా మెజిస్ట్రేట్ కి పంపామని వివరించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఏడు రోజుల్లో పూజలు ప్రారంభమవుతాయని.. అక్కడ సెల్లార్లలో ఏర్పాటు చేసిన హిందూ ప్రతిమలకు సంబంధించి ఎలా పూజలు చేయాలో కాశి విశ్వనాథ ఆలయ ట్రస్ట్ నిర్ణయిస్తుందని ఆయన ప్రకటించారు. న్యాయ పోరాటం కూడా తుది దశకు చేరుకుందని, తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఎవరైనా సందర్శించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.. ఈ కేసు వ్యాస్ కుటుంబానికి సంబంధించింది. 1993 వరకు నేల మాలిగ లో వారు పూజలు చేసేవారు. అయితే గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో అక్కడ పూజలు నిలిపివేతకు గురయ్యాయి. అప్పట్లో ఆందోళనలు చేసినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో తిరిగి పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హిందువుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి.

ఇక వారణాసి కోర్టు తీర్పు నేపథ్యంలో.. దానిని హైకోర్టులో సవాల్ చేస్తామని జ్ఞానవాపి మసీద్ కమిటీ ప్రకటించింది. అంతేకాదు జిల్లా కోర్టు ఆదేశాలను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతే జామియా మసీద్ కమిటీ ప్రకటించింది. అదే దీనిని వ్యతిరేకిస్తూ హిందువుల తరఫున న్యాయవాది విష్ణు జైన్ అలహాబాద్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించాలని కేవియట్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. మరోవైపు జ్ఞాన వాపి మసీదు కేసులో తదుపరి విచారణను వారణాసి కోర్టు ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. కాగా జ్ఞాన వాపి కేసు కు సంబంధించి వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును హిందూ సంఘాలు అయోధ్యతో పోల్చుతున్నాయి. అయోధ్య విషయంలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి అంతకుముందు కూడా కోర్టు ఇలాగే తీర్పు ఇచ్చిందని.. ఆ తర్వాత హిందూ సంఘాలు, హిందూ సంఘాల తరఫున న్యాయవాది వాస్తవాలను వివరించడంలో కోర్టును ఒప్పించగలిగారని.. దానివల్ల అయోధ్య వివాదానికి తెరపడిందని.. ప్రస్తుతం జ్ఞాన వాపి కేసు విషయంలోనూ అలాంటి పరిణామాలు జరుగుతున్నాయని.. త్వరలో ఇక్కడ కూడా అయోధ్య లాంటి నిర్మాణాన్ని చూస్తామని.. కాశీ విశ్వనాథుడి కోసం నంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నదని హిందూ సంఘాలు అంటున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular