
గూఢచర్యం ఆరోపణలపై పాక్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ అనుభవిస్తున్న బాధలు పగోళ్లకు కూడా రాకూడదని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కుల్ భూషణ్ ఒత్తిడిలో ఉన్నడని, ఆయన ఎవరిని కలవలేక పోతున్నారని పాక్ చెప్పడం వెనుక ఆయన అనుభవిస్తున్న వ్యధ అర్థమౌతున్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.శత్రు దేశాలో కటకటాల వెనుక ఆయన కృంగిపోతున్నట్లు, మనో నిబ్బరాన్ని కోల్పోతున్నట్లు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా… కుల్ భూషణ్ వ్యవహారంలో పాక్ వైఖరిలో వివిధ మలుపులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఒకడుగు ముందుకేసి తమ అధికారులు లేకుండా కుల్ భూషణ్ ను కలిసేందుకు భారత్ దౌత్యాధికారులకు అవకాశం కల్పించింది. కుల్ భూషణ్ ను అధికారులు కలిసేందుకు వెళ్లగా అక్కడ పాక్ అధికారులు ఉండడం పట్ల భారత్ అభ్యంతరం లేవనెత్తింది. అడ్డంకులు, అవరోధాలు లేని భేటీ విషయంలో అంతర్జాతీయ చట్టాలను పాక్ ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మూడో సారి భేటీకి తమ దేశ అధికారులు లేకుండానే భేటీకి అవకాశం ఇస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి వెల్లడించారు.
అసలేమి జరిగిందంటే…?
పాక్ ఏజెంట్లు 2016లో కుల్ భూషణ్ ను ఇరాన్ నుంచి అపహరించారు. గూఢఛర్యం కేసులో 2017 ఏప్రిల్ లో పాక్ సైనిక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. దానిని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది. 2017 మే 18న కోర్టు మరణశిక్షపై స్టే విధించింది. రెండు దేశాల వాదనలు విన్న న్యాయస్థానం సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుచేస్తూ 2019 జులై 17న తీర్పు ఇచ్చింది. ఐసీజే ఆదేశాల ప్రకారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. అందుకు జాదవ్ నిరాకరిస్తున్నారని పాక్ కథలు చెప్పడంతో కుల్ భూషణ్ ను కలిసేందుకు భారత్ అనుమతి అడిగింది. ఈ నేపథ్యంలో గురువారం రెండోసారి భేటీ జరిగింది. కుల్ భూషణ్ ఒత్తిడిలో ఉన్నారని, అతడితో మాట్లాడేందుకు ఆ దేశం స్వేచ్ఛనివ్వడం లేదని ఈ సందర్భంగా భారత్ అభ్యంతరం వ్యక్తంచేసింది.