నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఘట్టం చివరి మజిలికి చేరింది. రేపటి సాయంత్రంతో ప్రచారానికి బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హాలియా వేదికగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అప్పుడెప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఇప్పుడు చివరి టైమ్లో మరోసారి హాలియాకు వస్తున్నారు. అయితే.. ఈ సభలో కేసీఆర్ ఎలాంటి ఉపన్యాసం ఇవ్వబోతున్నారు..? ప్రజలపై ఎలాంటి వరాలు కురిపించబోతున్నారు..? నియోజకవర్గానికి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు..? సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
హాలియా టౌన్ శివారులోని పెద్దవూర మార్గంలో ఈ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభ కోసం 20 ఎకరాల స్థలాన్ని చూశారు. అంతేకాదు.. వాహనాల పార్కింగ్ కోసమే మరో 30 ఎకరాలను కేటాయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ సంఖ్యలో జనాన్ని తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ బహిరంగ సభ కోసం ఇప్పటికే నలుగురైదుగురు మంత్రులు అక్కడే మకాం వేశారు. దగ్గరుండి మరీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభను సక్సెస్ చేయాలనే ఆలోచనలో ఉండిపోయారు.
ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు చేదు అనుభవం ఎదురైంది. ఇక జీహెచ్ఎంసీ ఫలితాల్లోనూ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఫలితాలు వచ్చాయి. మేయర్ పీఠం కైవసం చేసుకున్నప్పటికీ గతంలో సాధించిన సీట్లను సాధించలేకపోయింది. ఈ రెండు ఫలితాలతో బీజేపీని మరోసారి చిన్న అంచనా వేయొద్దని నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను పూర్తిగా హరీష్ రావుకు అప్పజెప్పిన కేసీఆర్ అటు వైపు కనీసం చూడలేదు. ఆ అతివిశ్వాసమే పార్టీని కొంపముంచిందనే అభిప్రాయం కూడా ఆ సందర్భంలో వెల్లడైంది. ఇక జీహెచ్ఎంసీలో కూడా కేటీఆర్ తప్ప మరే ఇతర నేతలు ప్రచారంలో కనిపించలేదు.
ఇక.. ఇప్పుడు కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్ జానారెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటివరకు ఆయనను విమర్శించించేందుకు టీఆర్ఎస్ లీడర్లు సాహసించలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టంతా కేసీఆర్ మీదనే ఉంది. ఈ సభలో కేసీఆర్ జానారెడ్డిని టార్గెట్ చేస్తారని వినిపిస్తోంది. చూద్దాం.. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది.