
దేశంలోకి కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కేంద్రం నిర్ణయం మేరకు ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేయడంతో ఆయా రాష్ట్రాల్లోనూ ఆదాయానికి గండిపడింది. అయితే లాక్డౌన్లోనూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనం చెల్లించగా తెలంగాణలో మాత్రం ప్రభుత్వం కోతలు విధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఉద్యోగులకు ఎంతెంత కోత విధిస్తున్నారో ప్రకటించారు. వైద్య, పోలీస్, పారిశుధ్య, విద్యుత్ శాఖలను మినహాయించి ప్రభుత్వ ఉద్యోగులందరికీ సగం జీతంతోనే సరిపెట్టారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు మార్చి, ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు ప్రభుత్వం సగం జీతాన్ని మంజూరు చేసింది. మే నెలలో తెలంగాణలో భారీగా సడలింపులు ఇవ్వడంతో పూర్తిస్థాయి వేతనం అందుతుందని ఉద్యోగులు భావించారు. అయితే వారి ఆశలు ఆవిరైయ్యాయి. మే నెలలోనూ వారికి సగం జీతమే దక్కింది. గత మూడునెలలుగా ఉద్యోగులకు సగం జీతం రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జూన్ నెల జీతంపై కేసీఆర్ సర్కార్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.
జూన్ నెల నుంచి తమకు పూర్తిస్థాయి జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల జీతం, ఫించన్లో కోతలు పెట్టొద్దని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఎం కేసీఆర్ సహా సీఎస్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి జేఏసీ నేతలు ఈ మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఇదే అంశంపై తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) నేతలు కూడా తమ సమావేశంలో కీలకంగా చర్చించారు. జూన్లో పూర్తి జీతం ఇవ్వడంతోపాటు గత మూడు నెలల బకాయిలను కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనిపై సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నెల అయినా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతం అందుతుందో లేదో వేచి చూడాల్సిందే..!