Homeజాతీయ వార్తలుKarnataka Elections 2023: కర్ణాటక ఫలితం.. తెలంగాణపై ప్రభావం.. లెక్కలివీ!

Karnataka Elections 2023: కర్ణాటక ఫలితం.. తెలంగాణపై ప్రభావం.. లెక్కలివీ!

Karnataka Elections 2023: జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు రానున్నాయి. 24 గంటల్లో అధికారం ఎవరిదో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా కర్ణాటక జపమే చేస్తున్నాయి. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి ప్రభావం తెలంగాణపై ఎలా ఉంటుంది అని లెక్కలు వేసుకుంటున్నాయి.

అంచనాల్లో తెలంగాణ పార్టీలు..
ప్రతీ పార్టీకీ కొన్ని అంచనాలూ, వ్యూహాలూ ఉంటాయి. వాటిని సరిగ్గా వేసుకోకపోతే.. అడ్డంగా చిక్కుల్లో పడతాయి. ఈ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌కి కనిపిస్తోంది. ఈ మూడు పార్టీలూ.. కన్నడిగుల తీర్పు ఏంటి అని ఎదురుచూస్తున్నాయి. రేపు మధ్యాహ్నం కల్లా.. మ్యాటర్‌ తెలిసిపోతుంది.

బీజేపీ అధికారం నిలబెట్టుకుంటే..
కర్ణాటకలో అధికార బీజేపీ అధికారంలోకి వస్తే.. అది ఆ పార్టీకి భారీ విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. కర్ణాటకలో వరుసగా ఒకేపార్టీకి రెండోసారి అధికారం దక్కదు. అలాంటి అరుదైన ఫీట్‌ బీజేపీ సాధించినట్లు అవుతుంది. అది తెలంగాణలో ఆ పార్టీకి ఎక్స్‌ట్రా మైలేజ్‌ తెస్తుంది. సౌత్‌లో బలంగా పాతుకుపోవాలి అనుకుంటున్న బీజేపీ… నెక్ట్స్‌ తెలంగాణను ఓ పట్టు పట్టగలదు. ఆల్రెడీ బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే తెలంగాణపై ఫోకస్‌ పెట్టారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చనే ఉద్దేశంతో.. ముందునుంచే అప్రమత్తంగా ఉంటూ.. తమ కేడర్‌ని నిరంతరం యాక్టివ్‌గా ఉంచుతున్నారు.

కాంగ్రెస్‌ గెలిస్తే
కన్నడ ఫలితంపై కాంగ్రెస్‌ కాన్ఫిడెన్స్‌తో ఉంది. మొదటి నుంచి సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌.. ఆ పార్టీకే ఈసారి ఛాన్స్‌ అని చెబుతున్నాయి. రెండోసారి ఛాన్స్‌ ఇవ్వని కన్నడ సెంటిమెంట్‌ కూడా కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్‌ పెంచింది. కాంగ్రెస్‌ గెలిస్తే.. అది కర్ణాటకలోనే కాదు.. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి అది ఎక్కడలేని బూస్ట్‌ తెస్తుంది. ఇప్పటికే మొన్నటి ప్రియాంక గాంధీ.. సభలో.. నిరుద్యోగులకు వరాలు కురిపిస్తూ.. హామీలకు కచ్చితమైన గ్యారెంటీని ఇవ్వడం ద్వారా హస్తంలో.. కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెరిగాయి. మున్ముందు.. జాతీయ నేతలతో చాలా సభలు, ప్రచారానికి కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది.

బీఆర్‌ఎస్‌ లెక్కలు ఏంటి?
తెలంగాణలో రెండోసారి మరింత ఎక్కువ మెజార్టీతో గెలిచిన బీఆర్‌ఎస్‌.. మూడోసారి కూడా తామెందుకు గెలవకూడదు అనే ప్రశ్న వేసుకుంటోంది. కచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో.. ఆ పార్టీ సంవత్సర కాలంగా చాలా అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తోంది. ఫ్లైఓవర్లు, డాక్టర్‌ బీఆర్‌అంబేద్కర్‌ విగ్రహం, సెక్రటేరియట్‌ ప్రారంభం.. ఇలా ఆ పార్టీ.. తాము ఏం చేసిందీ.. ప్రజలకు కనిపించేలా చేస్తూ.. అభివృద్ధే ప్రచార అస్త్రంగా చేసుకుంది. నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ఎన్నికల ఏడాదిలో.. ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చేస్తే.. ఆ ఓట్లు కూడా తమకే పడిపోతాయని బీఆర్‌ఎస్‌ అంచనా వేసుకుంది. కానీ.. పేపర్ల లీకేజీ వ్యవహారం ఆ పార్టీ వ్యూహానికి గండికొట్టింది. ఈ క్రమంలో కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ఎలా ప్రభావితం చేస్తాయన్న లెక్కలు ఆ పార్టీనేలు వేస్తున్నారు. బీజేపీ గెలిస్తే ఎలా, కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ రాజకీయాలు ఎలా మారతాయిని అంచనాల్లో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు.

ఇలా ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీకి ఉన్నాయి. మొత్తంగా మరో 24 గంటల తర్వాత తెలంగాణ ఎన్నికల వేడి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయి నేతలంతా తెలంగాణకు వచ్చి వాలే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్‌లో ఎన్నికలు ఉంటాయనే సంకేతాలను సీఎం ఇవ్వడం వల్ల.. పార్టీలకు ఇంకా నాలుగైదు నెలల టైమే ఉంది. ఈ కొద్ది సమయంలో చేసిన ప్రచారాలు, ఇచ్చే హామీలే ఓటర్ల తీర్పును ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇకపై తెలంగాణ పాలిటిక్స్‌ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ కానున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular