తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించాయి. రాజకీయాల్లో తీవ్రచర్చనీయాంశంగా మారాయి. చివరకు జాతీయ మీడియా సైతం ఈ అంశానికి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఈటెలపై ఇలాంటి ఆరోపణలు రావడంపై చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు, పేరు బద్నాం తట్టుకోలేక ఈటెల మంత్రి పదవికి రాజీనామా చేస్తారని టీఆర్ఎస్ అధిష్టానం భావించిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ.. ఈటెల ఆ పని చేయలేదు. దీంతో.. అధికార పార్టీలో రాజకీయం రసకందాయంలో పడినట్టైంది.
అధికార పార్టీ సొంత పేపరు, ఛానల్ గా పేరుపడ్డ వాటిల్లో.. ఈటెలకు వ్యతిరేకంగా భారీ కథనాలు ప్రసారం చేశారు. బ్యానర్ స్టోరీలు ప్రింట్ చేశారు. దీంతో.. ఈటెల మంత్రి పదవి ఊడిపోవడం ఖాయం అంటూ ప్రచారం సాగింది. ఇప్పటికీ అందరికీ అదే మాట. అయితే.. ఆ పని ఎలా జరుగుతుంది? అన్నదానిపైనే ఉత్కంఠ నెలకొంది.
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి రాకుండా ఈటెల స్వయంగా వెళ్లిపోయేలా చేయాలన్నదే అధిష్టానం వ్యూహంగా చెబుతున్నారు. ఒకవేళ బర్తరఫ్ చేయాల్సి వస్తే.. మరో మంత్రి మల్లారెడ్డిపై చాలా కాలంగా భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు ఇంకా వేరే అంశాలు కూడా చర్చలోకి రావొచ్చు. ఇవన్నీ.. ఎందుకని ఈటల తనంతట తానుగా రాజీనామా చేసేలా ఈ వ్యూహం అమలు చేశారనేది విశ్లేషకుల మాట.
అయితే.. ఈ విషయాన్ని గుర్తించిన ఈటెల ఈ వ్యూహంలో తాను బలైపోవద్దని నిర్ణయించుకున్నారట. తనపై యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వమే తీసుకోవాలని చూస్తున్నారట. తాను రాజీనామా చేసి వెళ్లిపోతే.. ప్రజల్లో మరోవిధమైన అభిప్రాయం ఏర్పడుతుందని, అధినేత పంపిస్తే.. సానుభూతి కూడా వస్తుందని ఈటల భావిస్తున్నారట.
ఈ కారణంగానే ఈటల రాజీనామా చేయలేదని చెబుతున్నారు. దీనివల్ల అధిష్టానం వ్యూహం ఫలించలేదని చెబుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. ఈటలను పార్టీ నుంచి పంపించేయడంతోపాటు మంత్రి వర్గం నుంచి తొలగించాలని చూసినప్పటికీ.. జరగలేదని అంటున్నారు. మొత్తానికి గులాబీ కోటలో కుమ్ములాట ఇప్పుడు బయటపడింది. మరి, ఈ పంచాయితీ ఎలా ముగుస్తుంది? పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయి? అన్నది చూడాలి.