పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయం తెల్లవారు జాము నుంచి అమలులోకి వచ్చింది. దీంతో 11 రోజుల మధ్యంతర ఘర్షణలకు ముగింపు పలికింది. ఈ ఘర్షణల్లో సుమారు 240 మంది చనిపోయారు. ఎక్కువ మంది గాజాలోనే హతమయ్యారు. రెండు పక్షాల అనుమతితో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ఇజ్రాయెల్ కేబినెట్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి 2 గంటలకు ఈ ఒప్పందం అమలులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.
ఒప్పందం ఎలా కుదిరింది
ఇజ్రాయెల్, పాలస్తీనా కాల్పుల విరమణపై అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. కాల్పుల విరమణతో ఉద్రిక్తలు తొలగి శాంతి మార్గానికి మార్గం ఏర్పడుతందని విశ్వాసం పెంచుకున్నాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. గాజాలోని హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చల్లో ఈజిప్టు, ఖతర్, ఐక్యరాజ్య సమితి ప్రముఖ పాత్ర పోషించాయి.
కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రపంచ దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ నెతన్యాహుకు ఫోన్ చేసి ప్రశంసించారు. కాల్పుల విరమణ ఒప్పందంతో మరణాల సంఖ్య పెరగకుండా ఉంటుందని పేర్కొన్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇక అభివృద్ధిపై దృష్టి పెడతాయని భావిస్తున్నారు.