
పోలవరానికి కేంద్రం కొర్రీలు వేస్తోంది. ప్రాజెక్ట్ వ్యయం విపరీతంగా పెరగడాన్ని ఖండిస్తోంది. కరోనా వేళ అంత డబ్బు తమ దగ్గర లేదని.. ఇవ్వలేమంటోంది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసినప్పుడే ఇదే మాట అంది. దీంతో ఏపీ కలల ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఇంతలా పెరగడానికి కారకులు ఎవరు? జగన్ సర్కారా? గత చంద్రబాబు పాలనా? అంటే ఖచ్చితంగా చంద్రబాబే ఈ దుస్థితికి కారణం అంటున్నారు. పోలవరం పూర్తి చేయకుండా దాన్ని ఏటీఎంలా వాడుకొని కేంద్రం నుంచి గుంజేందుకే ఇలా సాగదీశారని.. అదే ఇప్పుడు ఏపీకి శాపం అయ్యిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Also Read: సంచలనం : పోలవరంపై కేంద్రానికి కుండబద్దలు కొట్టిన జగన్
పోలవరం ప్రాజెక్ట్ వ్యయాన్ని విపరీతంగా పెరిగింది. దీన్ని పూర్తిచేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కొర్రీలు పెడుతోంది. అయితే ఈ పోలవరం ప్రాజెక్టు వ్యయంలో అసాధారణ పెరుగుదలకు కారణం జగన్ ప్రభుత్వం కాదు.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గత టిడిపి ప్రభుత్వం సరికాని లెక్కల కారణంగానే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. అదే ఇప్పుడు కేంద్రానికి, వైసీపీ ప్రభుత్వానికి గుదిబండగా తయారైందని కాంగ్రెస్ పార్టీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
కేంద్రం పోలవరంపై చేతులు ఎత్తితే అది రాష్ట్ర ప్రజలకు భరించలేని భారం అవుతుంది. ఖర్చు సమస్యపై కేంద్రానికి బడ్జెట్ ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడం కూడా పుట్టి ముంచేలా ఉంది. పునరావాసంతోపాటు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని జూన్ 2021 నాటికి పూర్తి చేయడానికి నిధులను త్వరగా విడుదల చేసేలా వైసీపీ సర్కార్ చొరవ చూపాలి. మొత్తం ఖర్చును కేంద్రం భరించాలని ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజాగా ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్ర రాజు మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో చంద్రబాబు వ్యవహరించిన తీరు కారణంగానే ఈ ప్రాజెక్టును ఆలస్యం అయ్యిందని.. టిడిపి ప్రభుత్వం అడుగుజాడలను వైయస్ఆర్సి ప్రభుత్వం అనుసరించకుండా ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. “ఆలస్యం కారణంగా, ప్రాజెక్ట్ వ్యయం ఇప్పుడు రూ .50,000 కోట్లకు పెరిగింది, కాని 2013-14లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని కేంద్రం పట్టుబడుతోంది. అది ప్రస్తుత ప్రాజెక్టు వ్యయంలో సగం మాత్రమే అవుతుంది” అని ఆయన చెప్పారు.
గత టిడిపి ప్రభుత్వం, కమీషన్ల కోసమే, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని ఆయన ఆరోపించారు. “మునుపటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. దీనిని పూర్తి చేయడం కేంద్రం బాధ్యత. కానీ, చంద్రబాబు నాయుడు లాబీయింగ్ తో కేంద్రం బాధ్యతను వదులుకుని రాష్ట్రానికి అప్పగించింది. ఇప్పుడు, ఇది ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఇప్పటి బీజేపీ ప్రభుత్వం అంగీకరించడం లేదు, ”అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
Also Read: జగన్ నమ్మిన ఆ అధికారి ఎవరో తెలుసా?
దీన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా కనిపించడం లేదు. కరోనాతో ఆదాయం కోల్పోయిన కేంద్రం ఇప్పటికిప్పుడు 50వేల కోట్లు ఒక ప్రాజెక్ట్ పై ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అది ఇచ్చ నాలుగైదు వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి కాదు. దీంతో ఇది ఏపీకి గుదిబండగా మారుతుందా అన్న భయం ఏపీ ప్రజలను వెంటాడుతోంది.
Comments are closed.