Indian Army Kamikaze Drones 2026: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. అయితే మారుతున్న యుద్ధ రీతులతో భారత్ కూడా సరికొత్త ఆయుధాల సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. విదేశాల నుంచి కొనుగోలు చేయడం కన్నా సొంతంగా తయారు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తోంది. అత్మనిర్భర్వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గుజరాత్కు చెందిన స్టార్టప్ ఓ అద్భుతం చేసింది. సూరత్కు చెందిన డ్రోన్ తయారీదారు ఇన్సైడ్ఎఫ్పీవీ భారత సైన్యానికి రూ.10 కోట్ల విలువైన కమికాజీ (సుసైడ్) డ్రోన్లను కేవలం 60 రోజుల్లో సరఫరా చేసింది. రక్షణ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 2025లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఈ డ్రోన్లను ఉత్తర కమాండ్కు పంపించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ రూట్ కింద ఈ ఆర్డర్ ఇచ్చింది. సాధారణంగా 6–12 నెలలు పట్టే ప్రక్రియను 2 నెలల్లో పూర్తి చేయడం గమనార్హం.
కమికాజీ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవీ..
ఈ డ్రోన్లు సాధారణ డ్రోన్లలా కాకుండా, లక్ష్యం వద్ద తాము కూడా పేలిపోయేలా రూపొందించబడ్డాయి. శత్రువు జామ్ చేసినా, సిగ్నల్ లేకపోయినా స్వయంప్రతిపత్తితో లక్ష్యాన్ని చేరుకుంటాయి. –35 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలోనూ ఇవి పనిచేస్తాయి. ముందే నిర్దేశించిన మార్గంలో స్వయంప్రతిపత్తితో ఎగురుతాయి. పొరపాటున పేలకుండా అనేక భద్రతా పొరలు ఉంటాయి. లక్ష్యం చేరుకున్న తర్వాత మాత్రమే పేలుతాయి. ఈ డ్రోన్లు ఉత్తర సరిహద్దులో (లడఖ్, జమ్మూ–కాశ్మీర్) మోహరించడానికి అనుకూలం. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో జీపీఎస్ జామింగ్ సాధారణం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇవి విఫలం కావు.
‘మేక్ ఇన్ ఇండియా’కు నిదర్శనం..
ఈ డ్రోన్లలో 90 శాతం భాగాలు భారత్లోనే తయారయ్యాయి. మోటార్లు, బ్యాటరీలు, ఫ్లైట్ కంట్రోలర్లు, కెమెరాలు అన్నీ దేశీయ సప్లయర్ల నుంచి సమకూరాయి. ఇది ప్రధాని నరేంద్ర మోదీ ’ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. గతంలో ఇజ్రాయెల్, అమెరికా నుంచి డ్రోన్లు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు భారత్ స్వంతంగా తయారు చేసి, సరఫరా చేస్తోంది. సంస్థ సీఈవో అర్థ చౌదరి మాట్లాడుతూ, ‘మా డ్రోన్లు భారత్ కఠినమైన వాతావరణానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. 60 రోజుల్లో ఆర్డర్ పూర్తి చేయడం మా సామర్థ్యానికి నిదర్శనం‘ అని అన్నారు.
ఉత్పత్తి సామర్థ్యం పెంపు..
పెరుగుతున్న డిమాండ్ను చేపట్టడానికి సంస్థ తన తయారీని 20,000 చ.అడుగుల పెద్ద ఫ్యాక్టరీకి మారుస్తోంది. ఇక్కడ నుంచి నెలకు 500లకుపైగా డ్రోన్లు తయారు చేయగలరు. పెద్ద ఒప్పందాలు స్వీకరించగలదు. పరిశోధన అభివృద్ధి కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు.
భారత కమికాజీ డ్రోన్ మార్కెట్ 2027 నాటికి రూ.5 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా. సైన్యం 850 డ్రోన్ల కొనుగోలుకు రూ.2 వేల కోట్ల ప్రతిపాదన సిద్ధం చేసింది. ఇన్సైడ్ఎఫ్పీవీ వంటి సంస్థలు ఈ మార్కెట్లో 30 శాతం వాటా సాధించే అవకాశం ఉంది.