Ayodhya Ram`s Image : అయోధ్య రామ మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకకు ఎనిమిది వేల మంది అతిథులను ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట క్రతువు నిర్వహించారు. బాల రాముడి దివ్యమైన రూపాన్ని దర్శించిన యావత్ దేశం పులకించిపోయింది. దేశమంతా పండుగలా రామాలయ ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నారు. జై శ్రీరామ్ నామంతో భారత దేశం మార్మోగింది. ప్రత్యక్షంగా 8 వేల మంది వీక్షించగా, పరోక్షంగా కోట్లాది మంది రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను వీక్షించారు. ఆన్లైన్లోనూ వేలాది మంది వీక్షించారు. అయితే ఇదే సమయంలో కొన్ని ఫేక్ ఫొటోలను కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోలు భారతీయులను ఆకర్షించినా, అందులో చాలా వరకు మార్ఫింగ్ ఫొటోలు కావడం గమనార్హం. ఇలాంటి ఫొటోల్లో ఒకటి దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా భవనంపై శ్రీరాముని చిత్రం ప్రదర్శన కూడా ఉంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో అత్యధికంగా వైరల్ అయింది. ‘జై శ్రీ రామ్’ అని రాసి ఉన్న లార్డ్ రామ్ ఋషి వేషంలో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని భారతీయులు ఎక్కువగా షేర్ చేశారు.