కరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎంతగా తాపత్రయ పడుతున్నా మిత్ర పక్షం ఎంఐఎం నుండి వస్తున్న రాజకీయ వత్తిడులకు తల వంచక తప్పక పోవడంతో వైరస్ ఉధృతిలో హైదరాబాద్ నగరం నేడు జాతీయ స్థాయిలో పేరొందుతున్నది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్ 10 జిల్లాల్లో హైదరాబాద్ 7 స్థానంలో ఉంది.
శుక్రవారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 2.7 శాతం హైదరాబాద్కు చెందినవే ఉన్నాయి. కరోనా కేసుల లోడ్ ఎక్కువగా ఉన్న 27 జిల్లాల వివరాలను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెల్లడైనది.
దేశవ్యాప్తంగా ముంబైలో 13.8 శాతం, ఢిల్లీలో 11.6 శాతం, అహ్మదాబాద్లో 7.7, ఇండోర్ 4.5, జైపూర్ 3.8, పుణెలో 3.5, హైదరాబాద్ 2.7, సూరత్ 2.2, థానేలో 2 శాతం కేసులు నమోదయ్యాయని తెలిపారు. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్ ద్వారా ఈ జిల్లాల్లో కరోనాను కంట్రోల్ చేయాల్సి ఉందని తెలిపారు.
ఇక తెలంగాణలోని కరోనా కేసుల్లో 55.9 శాతం హైదరాబాద్లోనే ఉన్నాయని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మొత్తం 1001 కేసుల్లో దాదాపు 570 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ఆదివారం తెలంగాణలో నమోదైన 11 కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ లాక్డౌన్ ఉల్లంఘనలు జరుగుతుండడంతో ఓ బృందాన్ని పరిశీలన కోసం పంపింది. పాతబస్తీలోని హాట్ స్పాట్ లలో కూడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ యువకులు, చివరకు వైరస్ ప్రభావం గల వారు సహితం సవైరవిహారం చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తున్నది.