తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాలలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై విరుచుకుపడనుందనే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని ఐఎండీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తుపాను ప్రభావంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.