చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపించింది. 10లక్షలకు పైగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. కరోనా ప్రభావం అన్నిరంగాలపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య, సినిమా, క్రీడలపై దీని ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెల్సిందే. తాజాగా ఫిపా అండర్-17 మహిళల వరల్డ్ కప్ వాయిదా వేస్తున్నట్లు ఫిపా శనివారం ప్రకటించింది.
భారత్ వేదికగా 2020 నవంబర్లో ఫిఫా అండర్-17మహిళల ప్రపంచకప్ జరుగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారంగా అయితే నవంబర్ 2నుంచి 21వరకు కోల్కతా, గువహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై వేదికల్లో ఈ టోర్ని నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 16 జట్లు పోటీలో ఉన్నాయి. తొలిసారిగా భారత్ పోటీలో నిలిచింది. టోర్నీకి సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఫిఫా వెల్లడించింది.
ఫిపా అండర్-17 మహిళల ప్రపంచ కప్ తోపాటు పనామా, కోస్టారికా వేదికగా ఆగస్టు-సెప్టెంబర్లో నిర్వహించాల్సిన అండర్-20మహిళల ప్రపంచకప్ కూడా వాయిదా పడింది. ప్రపంచంలో కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో ఫిఫా తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.