Homeజాతీయ వార్తలుకేంద్రం రిటైలర్ల వత్తిడులకు లొంగిందా!

కేంద్రం రిటైలర్ల వత్తిడులకు లొంగిందా!


లాక్‌డౌన్‌ నుంచి అత్యవసరం కాని వస్తువుల విక్రయాలకు వెసులుబాటు లభించిందనుకున్న ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం అకస్మాత్తుగా గా కళ్లెం వేయడంతో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థలు ఖంగుతిన్నాయి.

పప్పుదినుసులు తదితర ఆహారోత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు వంటి అత్యవసరాల సేవలు మినహా మిగతా వాటిని ఆపేయాలని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ మొదలగు ఆన్‌లైన్‌ సంస్థలను తాజాగా ఆదేశించడంతో విస్మయం చెందుతున్నారు.

ఈ నెల 20 నుంచి మొబైల్‌ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లు, వాషింగ్‌ మెషీన్లు, రెడిమేడ్‌ దుస్తులు తదితర అత్యవసరం కానీ వస్తువుల అమ్మకం కూడా ఈ-కామర్స్‌ సంస్థలు జరుపవచ్చని 15వ తేదీన కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఆన్‌లైన్‌ సంస్థలన్నీ కస్టమర్ల నుంచి ఆర్డర్లు కూడా తీసేసుకున్నాయి.

ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అకస్మాత్తుగా ప్రకటించారు. ఈ-కామర్స్‌ సంస్థలు వినియోగించే వాహనాలు.. అవసరమైన అనుమతులతో మాత్రమే నడుస్తాయని తాజా ఆదేశంలో ఆయన స్పష్టం చేశారు.

కరోనా తీవ్రతతో నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తున్నదని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ చెప్పినా ఈ నిర్ణయం వెనుక రిటైలర్ల వత్తిడులు కారణమని తెలుస్తున్నది. ఆన్‌లైన్‌ మార్కెట్‌ జోరందుకున్న దగ్గర్నుంచి సంప్రదాయ రిటైల్‌ మార్కెట్‌ కళ తప్పుతూ ఉండడం తెలిసిందే. ఈ-కామర్స్‌ సంస్థలు ఇస్తున్న ఆఫర్లు.. రిటైలర్ల వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలకు మొబైల్‌ ఫోన్స్‌, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర అత్యవసరం కానీ వస్తువుల అమ్మకాలకు అనుమతి ఇవ్వొద్దని, కేంద్రంపై రిటైలర్లు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తున్నది. వారిని అనుమతిస్తే.. తమ షాపులూ తెరుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని స్థానికి వ్యాపారులు డిమాండ్‌ చేసినట్లు చెబుతున్నారు.

ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా అత్యవసరం కాని ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించడం అటు వినియోగదారులను, ఇటు చిరు వ్యాపారులను నిరాశపరిచిందని అమెజాన్ విచారం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తయారీదారులనూ నిరాశకు గురిచేసిందని పేర్కొన్నది.

అయితే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాల ఈ నిర్ణయాన్ని అఖిలభారత వర్తకుల సంఘం స్వాగతించింది. దేశీయ వర్తకుల మనోభావాలకు విలువనిచ్చారని, సంప్రదాయ వ్యాపారుల ప్రయోజనాలను రక్షించారని కొనియాడారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular