దేశం వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తక్కువ సమయంలోనే కరోనా ఫలితాలు వస్తాయని..వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెప్పించుకుంటున్నాయి. తద్వారా ఎక్కువ మందికి పరీక్షలు చేసే అవకాశముంటుందని భావిస్తున్నాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఏపీతో పాటు పలు ప్రభుత్వాలు ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకొని పరీక్షలు చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం సౌత్ కొరియా నుంచి 5 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్ల దిగుమతికి ఆర్డర్ ఇచ్చింది.
కరోనా వైరస్ ను నిర్ధారించడానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తో చేస్తున్న పరీక్ష ఫలితాల్లో కచ్చితత్వం లోపిస్తోందని రాజస్థాన్ ప్రభుత్వం
సంచలన వార్తను వెలువరించింది. ఈ సమస్యను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. ఫలితాల్లో 90 శాతం కచ్చితత్వం వస్తుందని అంచనా వేస్తే.. కేవలం 5.4 శాతం వస్తోందని, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రఘు శర్మ అన్నారు.
‘‘సలహా కమిటీ సూచనల మేరకు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ను వినియోగించడాన్ని నిలిపివేశాం. ఐసీఎంఆర్కు ఈ సమస్య గురించి తెలియజేశాం. వారి నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని శర్మ తెలిపారు. పీసీఆర్తో నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకిందని తేలిన వారికి ర్యాపిడ్ కిట్స్ తో పరీక్షలు నిర్వహించామని, కానీ ఫలితాల్లో నెగిటివ్ అని వస్తోందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నుంచి స్పందన సానుకూలంగా వస్తే, కిట్స్ను తిరిగి వెనక్కి పంపిస్తామని వెల్లడించారు. రాజస్థాన్లోని హాట్ స్పాట్స్ లో శుక్రవారం నుంచి ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్స్ కిట్స్ తో పరీక్షలు నిర్వహిస్తోంది.
రాజస్థాన్ లో ఇప్పటి వరకు 1628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 97 మంది కోలుకోగా.. 25 మంది మరణించారు. ప్రస్తుతం రాజస్థాన్ లో 1505 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.