Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీలో (Congress Party) సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి దళితులకే ఇస్తామని చెప్పి మరోసారి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టారు. రాజకీయ చదరంగంలో తనదైన శైలిలో ఎత్తులు వేసే కోమటిరెడ్డి ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే దళిత ముఖ్యమంత్రి పదవి విషయం కాస్త ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పార్టీలో కలకలం సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరీ ముందుకు వెళుతున్నారు.
ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు. కాగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకంతో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తుండడంతో ఇప్పుడు కోమటిరెడ్డి ప్రకటన వారిలో నూతనోత్తేజం నింపేందుకు దోహదపడుతునందని భావిస్తున్నారు. ఇదే సందర్భంలో సీఎం కావాలని కలలు కంటున్న రేవంత్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లే పనికి కూడా బీజం వేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడిన సందర్భంలో రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహాన్ని నింపారు. పార్టీని ముందంజలో నిలుపుతున్నారు. పార్టీ నేతలందర్ని కలుపుకుని నిరసనలు చేపట్టి పార్టీ ఉనికికి ప్రాధాన్యం తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ చెప్పినట్లు గా వచ్చే ఎన్నికల్లో 72 సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధిస్తే రేవంతే సీఎం అభ్యర్థి అయ్యే ప్రమాదం ఉన్నందున ఆయన ఆలోచనను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో కోమటిరెడ్డి దళిత ముఖ్యమంత్రి నినాదాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఈ విధంగా ప్రకటనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్లు అందరు సైలెంట్ అయిపోయినా కోమటిరెడ్డి మాత్రం తన నోటికి పని చెబుతున్నారు. పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డికి సీఎం పదవి అందకుండా చేయడంలో భాగంగానే దళిత ముఖ్యమంత్రి ప్రకటన వెలుగులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉన్నట్లు సమాచారం.