తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలో ఏపీ సీఎం జగన్ నడవాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అందుకే రెండున్నరేళ్ల తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి కొత్త వారికి మంత్రి పదవులు ఇస్తానని మాట ఇచ్చిన జగన్ ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణను విరమించుకున్నట్టు సమాచారం.
కేబినెట్ విస్తరణతో ఇప్పుడున్న వారి మంత్రి పదవులు పోయి కొత్త వారికి అవకాశాలు వస్తాయి. అయితే పెద్ద గందరగోళానికి దారితీయడం ఖాయం. ఇప్పుడున్న మంత్రులు తమ పదవులు కోల్పోయి అధికారం పోతే తట్టుకోలేరు. అసమ్మతి వచ్చేస్తుంది. ఇక కొత్త వారి నుంచి తమకే మంత్రి పదవులు కావాలనే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే అలానూ అసమ్మతి ఖాయం.
ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యేలు రోజా, అంబటి, ధర్మానా, భూమన లాంటి సీనియర్లకు జగన్ మంత్రి పదవులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎవ్వరికి ఇవ్వకున్నా వచ్చే రెండున్నరేళ్లలో ఈ అసమ్మతి వైసీపీని కాల్చేస్తుంది.
ఇప్పటికే శాసనమండలిని రద్దు చేస్తాననే పేరుతో మోపిదేవీ, పిల్లి సుభాష్ లను మంత్రి పదవుల నుంచి తొలగించి రాజ్యసభకు పంపారు జగన్. దీంతో ఆ ఉత్సవ విగ్రహాల్లాంటి పదవులు తీసుకున్న వారు సైలెంట్ అయ్యారు. జిల్లాలోనూ వారి పేరు పరపతి హోదా లేకుండా పోయింది.మండలి రద్దు కాకపోవడంతో వారిని అనవసరంగా మంత్రి పదవుల్లోంచి తీసేసినట్టు అయ్యింది.
అందుకే మరోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని.. తెలంగాణలోలాగానే ఏపీలోనూ కేబినెట్ విస్తరణ చేయవద్దని.. ఎలాంటి అసమ్మతికి గురికావద్దని జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.