ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్లో చుక్కెదురైంది. సస్పెన్షన్పై ఆయన వేసిన పిటిషన్ను క్యాట్ కొట్టివేసింది. తన సస్పెన్షన్ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) మంగళవారం కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యానికి నిరాకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పీలు చేసుకోవాలని ఈ మేరకు క్యాట్ సూచించింది. ఈ సస్పెన్పన్ను రద్దు చేసేందుకు క్యాట్ నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను క్యాట్ సమర్థించినట్లయ్యింది. కాగా ఇప్పటికే ఈ సస్పెన్షన్ను కేంద్ర హోం శాఖ సమర్థించిన సంగతి తెలిసిందే.
1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రవర్తనా నియమాల్ని ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో స్పష్టం చేసింది. పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను సైతం ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది.