Homeజాతీయ వార్తలుTemperatures: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న భానుడు.. పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా.. ఎన్నిరోజులీ భగభగలు?

Temperatures: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న భానుడు.. పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా.. ఎన్నిరోజులీ భగభగలు?

Temperatures: ప్రస్తుతం ఏకాలమో ఎవరికీ అర్థం కావడం లేదు. రాత్రి కాస్త చల్లగా, పొద్దంతా భానుడి భగభగలు.. అపు‍్పడప్పుడు చిరు జల్లులు ఇదీ పరిస్థితి. దీంతో వానాకాలం కూడా వేసవిని తలపిస్తోంది. వాస్తవాని‍కి ప్రస్తుతం వనాకాలం ముగింపు, శీతాకాలం ప్రారంభంలా చిరు జల్లులు, రాత్రి చల్లచల్లగా ఉండాలి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదు కావాలి. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఓవైపు మాడు పగిలేలా ఎండలు, మరోవైపు తీవ్రమైన ఉక్కపోత.. దీంతో జనాలు విలవిలలాడుతున్నారు. ఇవేం ఎండలు రా నాయనా అని జనం నిట్టూరుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇదీ పరిస్థితి.

నిప్పుల కుంపటిలా..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రస్తుతం పగలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పోనీలే ఇది సమ్మర్ కదా. అందుకే ఎండలు ఇలా మండిపోతున్నాయి, అడ్జస్ట్ అయిపోదాంలే అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇది సమ్మర్ కాదు. వేసవి కాలం అయిపోయింది. అయినా ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. దీంతో జనం పరేషాన్ అవుతున్నారు. వేసవిని తలపిస్తున్న ఎండలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

ఎందుకిలా…
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎందుకిలా మారాయి? ఎందుకు ఎండలు ఇంతలా మండిపోతున్నాయి? పగటి ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగాయి? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిపై వాతావరణ శాఖ అధికారులు స్పందించారు. ఎండలు ఈ రేంజ్‌లో మండిపోవడానికి కారణం నైరుతి రుతుపవనాల తిరోగమనమే అంటున్నారు. వాటి కారణంగానే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. సాధారణం కన్నా మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటున్నారు.

పక్షం రోజులు ఇదే పరిస్థితి..
అక్టోబర్‌ నెలాఖరు నాటికి రుతుపవనాల తిరోగమనం పూర్తవుతుంది. నవంబర్ మొదటి వారం నుంచి శీతాకాలం ప్రారంభం అవుతుంది. అప్పటివరకు ఇదే తరహా ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొడి వాతావరణం కారణంగానే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి అర్బన్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. అందుకే ఎండ వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది. నవంబర్ మొదటి వారం వచ్చే వరకు జనాలకు ఈ ఎండవేడి, ఉక్కపోత బాధలు తప్పేలా లేవు.

సాధారణం 33 డిగ్రీలే..
వాస్తవానికి ప్రస్తుతం 31 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. కానీ తిరోగమన రుతుపవనాల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగాయి. 35 నుంచి 36 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈశాన్య రుతుపవనాలు వస్తాయి. ఆ తర్వాత చలి మొదలయ్యే అవకాశం ఉంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular