chalo amalapuram
ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు.. విధ్వంసం పెరిగిపోయాయి. దీంతో హిందువులు, పార్టీల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే దీక్షలతో నిరసన తెలిపిన బీజేపీ తాజాగా చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
అమలాపురంలో ఇటీవల ‘హిందుత్వానికి’ అపచారం జరిగింది. ఈ క్రమంలోనే హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూ బీజేపీ చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమం కాస్త ఉద్రిక్తంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు.. నేతలు, కార్యకర్తలు శుక్రవారం అమలాపురం చేరుకునేందుకు రెడీ అయ్యారు. కానీ.. వారిని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి వంటి ముఖ్య నాయకులను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. విష్ణువర్ధన్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తమ వాహనంలో గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆ పార్టీనేత పురందేశ్వరి చలో అమలాపురం కార్యక్రమం బయలుదేరేందుకు సిద్ధపడడంతో ఆమెనూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
వీరితోపాటు మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్బాబును హనుమాన్ జంక్షన్లో పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీర్రాజును అరెస్టు చేయడంతో తాడేపల్లిలోని ఆయన నివాసానికి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.