అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యాటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ హౌస్ లో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఇరు దేశాధినేతలు మాట్లాడారు.
మొదటగా మాట్లాడిన ప్రధాని మోడీ… మోతెరా స్టేడియంలో ట్రంప్కు అపూర్వ స్వాగతం పలికామన్నారు. అహ్మదాబాద్ లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని మోడీ అన్నారు. 21వ శతాబ్దంలో అమెరికా-భారత స్నేహం చాలా ముఖ్యం అని అన్నారు. దేశ భద్రతకు అమెరికా, భారత్ మైత్రీ బంధం ఎంతో సాయంగా ఉంటుందని మోడీ అన్నారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ స్మగ్లింగ్ పై ఉమ్మడి కార్యాచరణ చేస్తున్నామన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ట్రంప్ పాలసీలతో ట్రేడ్ బంధం బలోపేతం అవుతోందన్నారు. రక్షణ, భద్రత, టెక్నాలజీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతాయని, ట్రంప్ సతీసమేతంగా రావడం ఆనందంగా ఉందన్నారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం పెరిగిందని మోడీ అన్నారు.
రక్షణ రంగం బలోపేతం
తర్వాత మాట్లాడిన ట్రంప్.. ఇది మర్చిపోలేని ప్రత్యేకమైన పర్యటన అని, ఇరు దేశాలకు ఇది ఫలవంతమైన పర్యటనగా మిగులుతుందని అన్నారు. రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి రెండు దేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించామని, భారత్, అమెరికా రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకునే విధంగా పరస్పర సహకారం ఉంటుందని అన్నారు. రెండు దేశాల మధ్య 21,500 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాలు జరిగాయని ట్రంప్ అన్నారు. వీటిలో అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాటర్లు లాంటివి ఉన్నాయి ట్రంప్ చెప్పారు.