తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాకతీయ యూనివర్సిటీలో వారం క్రితం పురుగుల మందు తాగిన సునీల్ నాయక్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు. సునీల్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం. ఆయన స్వగ్రామంలో నిర్వహిస్తున్న అంత్యక్రియలకు వెళ్తున్న బండి సంజయ్ ను.. నర్సంపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులను టీఆర్ఎస్ సర్కారు మోసం చేసిందని అన్నారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం మాట తప్పడం వల్లే సునీల్ ప్రాణాలు తీసుకున్నాడని సంజయ్ ఆరోపించారు. నిరుద్యోగ భృతికోసం కలెక్టరేట్లను ముట్టడిస్తే అరెస్టులు చేస్తున్నారని అన్నారు.
అంతేకాదు.. బీజేపీ హిందువుల పార్టీ అని కూడా బండి సంజయ్ అన్నట్టు సమాచారం. ప్రతీ ఇంటికి నీళ్లు, నిధులు, నియామకాలు విడుదల చేసింది కేంద్రమేనని చెప్పారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై బీజేపీ పోరాడుతుందని అన్నారు. ప్రజలు కేసీఆర్ కు బుద్ధిచెబుతారని అన్నారు బండి సంజయ్.
ఇదిలాఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని, ఉద్యోగాల కోసం చూసి విసిగిపోయానని.. ఇటీవల సెల్పీ వీడియో తీస్తూ సునీల్ పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు అతన్ని మొదట వరంగల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. వారం పాటు చికిత్స పొందిన సునీల్.. ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.