తమ కుటుంభానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకొని రాత్రికి రాత్రి తనను చైర్మన్ పదవి నుండి మార్చడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ట్రస్ట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని స్పష్టం చేశారు.
పైగా వేరే మతంకు చెందిన తన అన్నగారి కుమార్తెను నియమించడాన్ని ప్రస్తావిస్తూ వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినా ప్రభుత్వ జీవోను ఇప్పటివరకు బయటపెట్టకుండా వేరే మతానికి చెందిన మహిళకు ఏ విధంగా బాధ్యతలు అప్పజెబుతారని ఆయన ప్రశ్నించారు.
మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో 105 ఆలయాలు ఉన్నాయని చెబుతూ ట్రస్ట్, దేవాదాయ భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. దాతల భూములు ఆలయాలకే చెందాలని అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు.
మాన్సాస్ చైర్మన్ పదవి మార్పు వింతగా ఉందని చెబుతూ భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని హెచ్చరించారు. మాన్సాస్ ట్రస్ట్లో దేవాదాయ శాఖ అధికారులతోనే… నిర్వీర్యం చేయడానికి కొన్నాళ్లుగా ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మారినా… ఇలాంటి సమస్యలు రాలేదని వాపోయారు.
రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారించారు. ట్రస్టీగా తానేదైనా పొరపాట్లు చేసి ఉంటె తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి ఎలా తొలగిస్తారని నిలదీశారు.
జివో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?… ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల పరిశ్రమలు, పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు