Homeజాతీయ వార్తలు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు వెనుకున్నది వాళ్లేనా?

 మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు వెనుకున్నది వాళ్లేనా?

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్షణరావు అలియాస్‌ గణపతి, మల్లోజుల వేణు గోపాల్‌ అలియాస్‌ భూపతి, కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, గణపతి భార్య సుజాత, భూపతి భార్య తారాబాయి.. వీరందరూ మావోయిస్టు పార్టీలో కీలక నేతలే. అందరూ కేంద్ర కమిటీ సభ్యులే. ఆల్‌ ఆఫ్‌ సడన్‌గా వీరందరూ ఒక్కసారిగా ఎందుకు లొంగి పోవాలని అనుకుంటున్నారు..? దశాబ్దాలుగా అడవుల్లోనే గడుపుతున్న వీరు.. జనజీవన స్రవంతిలో కలవాలని ఎందుకు నిర్ణయానికి వచ్చారు..? దీని వెనుక  ఏమైనా స్కెచ్ ఉందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

నక్సల్స్‌ అణచివేతలో ఆది నుంచీ తెలంగాణ పోలీసులది ప్రత్యేక స్థానమే అని చెప్పొచ్చు. అయితే.. ఎప్పుడూ మావోయిస్టులతో కొట్లాడడం.. మళ్లీ ఆ తర్వాత మావోయిస్టులు కొత్త రిక్రూట్‌మెంట్‌ చేయడం పరిపాటిగా మారింది. ఈ విధానానికి ఫుల్‌స్టాప్‌ పలకాలని అనుకున్నట్లున్నారు. ఏకంగా మావోయిస్టు అగ్రనేతలపైనే కన్ను వేశారు. వారిని లొంగు‘బాట’ దిశలోకి తీసుకొస్తే పార్టీని పూర్తిస్థాయిలో దెబ్బతీసినట్లు అవుతుందని భావించరు. అగ్రనేతల లొంగుబాటుతో క్యాడర్‌‌లో ఆత్మస్థైర్యం దెబ్బతినడమే కాకుండా మానసికంగానూ కుంగుబాటుకు లోనవుతారు. తద్వారా ఉద్యమం నీరుగారిపోతుందని అనుకున్నారు.

ఇందుకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను టార్గెట్‌గా పెట్టుకున్నారని ప్రచారం సాగుతోంది.  ఈ నేపథ్యంలో అగ్రనేతలను తీవ్ర మానసిక, శారీరత ఒత్తిడికి గురిచేసి లొంగుబాటు మినహా గత్యంతరం లేని పరిస్థితులను కల్పించారు. నెత్తురు చిమ్మకుండా మావోయిస్టులపై పైచేయి సాధించాలని భావించారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే కొంత కాలంగా స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) ఈ అంశంలో చాకచక్యంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. గణపతి లొంగుబాటు ప్రక్రియ తెలంగాణ నుంచే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా మావోయిస్టు అగ్రనేతలు ఎస్‌ఐబీతో టచ్‌లో ఉన్నారని, నాగపూర్‌‌ నుంచి మొదలైన లొంగుబాటు చర్చలు, రాయపూర్‌‌ దగ్గర ఫైనల్‌ అయినట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గా అదుపులో ఉన్న వీరంతా ఒకేసారి కేంద్ర హోం మంత్రి ముందు లొంగిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇదంతా వ్యవహారంలో కీలక భూమిక పోషించిన నేత పేరు మాత్రం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మావోయిస్టు పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, ముఖ్య నక్సల్ నేతలను ‘లొంగుబాటు’ దిశగా పయనింపజేయడంలో ఇంటలిజెన్స్‌ విభాగం సక్సెస్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ పోలీసు శాఖ తన చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నట్లే. గణపతి సహా మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతే తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలన ఘటనగా నమోదవుతుందనడంలో సందేహం లేదు.

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోనున్నారనే వార్తలు ఈ ఉదయం నుంచీ చక్కర్లు కొడుతున్నా.. అగ్రనేతలు సైతం లొంగిపోయేందుకు రెడీ ఉన్నారంటూ వార్తలు వస్తున్నా ఇంతవరకు ‘హక్కుల సంఘం’ నేతలు గానీ, ఇతరత్రా విప్లవ సానుభూతిపరులు గానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

అయితే.. గణపతి లొంగుబాటుకు ముందు కొన్ని షరతులు కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ‘వివిధ రాష్ట్రాల్లో తనపై 150 కేసులు ఉన్నందున వాటన్నింటినీ బేషరతుగా ఎత్తివేయాలి. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు ఉండడంతో ప్రశాంత జీవితం గడిపే వాతావరణం ఉండాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడులు ఉండకూడదు. జీవనాధారానికి ఆర్థిక సాయం లేదా ఉపాధి అవకాశాలు కల్పించాలి ’ అని ప్రధాన డిమాండ్లు పెట్టారు. వీటన్నింటినీ ప్రభుత్వం ఒప్పుకుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular