
రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, పంచాయితీ కార్యాలయాలకు ఇతర కట్టడాలకు వేసే రంగుల విషయంలో మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మార్గదర్శకాలు విడుదల చేస్తోన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గ్రామ పంచాయితీ కార్యాలయాలకు మట్టి రంగుతో పాటు తెలుపు, నీలం, ఆకుపచ్చని రంగులు వేయాల్సిందిగా సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా నాలుగు రంగులకు అర్ధాలు చెబుతూ ఉత్తర్వులలో వీటి అర్ధాలను వివరించింది. మట్టిని సూచిస్తూ టెర్రకోట రంగు, పాడి పంటలకు సూచనగా ఆకుపచ్చ, నీలి విప్లవానికి సూచనగా నీలం రంగు, పాల విప్లవానికి సూచనగా తెలుపు రంగులు వేయాల్సిందిగా కమిటీ సూచించినట్లు పేర్కొంది. ప్రభుత్వానికి సంబంధించిన కట్టడాలు, భవనాలకు జాతీయ బిల్డింగ్ కోడ్ మేరకు ఈ రంగులు వేయాల్సిందిగా సూచనలు ఇచ్చింది.
ప్రభుత్వ భవనాలపై ఏ రాజకీయ పార్టీకి చెందిన చిహ్నాలు, రంగులు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.ప్రతీ ప్రభుత్వ విభాగం, స్థానిక సంస్థలు ఇతర ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించిన రంగును ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు పంచాయతీలకు వైసీపీ రంగులు వేయడంపై దాఖలు చేసిన పిటీషన్ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణ అనంతరం ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. రంగులు తొలగించేందుకు 4 వారాలు ప్రభుత్వం గడువు అడిగితే మూడు వారాల గడువు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వేయాలిసిన రంగులకు సంబంధించి నియమించిన కమిటీ సూచనల మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.