ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి చంద్రబాబు హయాంలోనే ప్రత్యేక అధికారుల పాలన స్టార్ట్ కాగా.. ఇంకా రాష్ట్రంలో అదే తంతు నడుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అంతలోనే కరోనా స్టార్ట్ అయింది. దీంతో ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే.. ఈ విషయంలో ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం పోరు నడుస్తూనే ఉంది.
Also Read: తెలంగాణలో ‘వైసీపీ-షర్మిల’కు సాధ్యమేనా?
అయితే.. పంచాయతీ ఎన్నికల విషయంలో లేనిపోని పంతాలకు పోయి తలబొప్పి తెచ్చుకుంటోంది ఏపీ ప్రభుత్వం. కొత్తగా.. ఎస్ఈసీతో బదిలీల గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్ను ఎస్ఈసీ బదిలీ చేయమన్నారని.. సీఎస్ బదిలీ చేశారని మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే.. వాస్తవానికి ఎస్ఈసీ బదిలీ చేయమన్నది.. ద్వివేదీ, గిరిజాశంకర్లను కాదు. గతంలో చెప్పినట్లుగా ఇద్దరు ఎస్పీలతో సహా తొమ్మిది మంది ఆఫీసర్లను బదిలీ చేయమన్నారు. ముందు వారిని విధుల నుంచి తప్పించి కొత్త వారిని నియమిస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందంటున్నారు. అయితే.. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాత్రం.. వారిని బదిలీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్తో అత్యవసర భేటీ తర్వాత పెద్ది గిరిజాశంకర్, గోపాలకృష్ణ ద్వివేదీలను బదిలీ చేసేశారని.. ఎంత మందిని బదిలీ చేయించుకున్నా.. తాము వెనక్కి తగ్గబోమని చెప్పుకొచ్చారు. అసలు బదిలీ చేయకుండానే పెద్ది రెడ్డి అలా ప్రకటన చేశారంటే.. ప్రభుత్వం వ్యూహాత్మకంగా బదిలీలపై తప్పుడు ప్రచారం ప్రారంభించిందనే అభిప్రాయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు తప్పు చేశారు. ఎస్ఈసీ ప్రకటించినా ఓటర్ల జాబితా ప్రిపేర్ చేయలేదు. అది న్యాయస్థానాల ముందు తీవ్ర నేరంగా ఉంటుంది. దీంతో వారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: ఏపీ పోలీస్ బాస్కు జస్ట్ మిస్..! : లేదంటే అదే జరిగేది
దీంతో వారిని ఎస్ఈసీ తప్పించడానికన్నా ముందే.. బదిలీ చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఈ మేరకు మీడియాకు లీక్ ఇచ్చారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఉన్నతాధికారులనే కాదు.. ఎవరినీ బదిలీ చేయాలన్నా ఓ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారం.. వెంటనే బదిలీ చేయలేరు. ఎస్ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే చిక్కుముడి ఏర్పడింది. ఎస్ఈసీనే బదిలీ చేసిందని ప్రచారం చేయడంతో ఇప్పుడు ఆ బదిలీలను చేయవద్దని ఎస్ఈసీ ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రచారానికి చెక్ పడినట్లవుతుంది. మొత్తంగా ఇప్పుడు బంతి ఎస్ఈసీ చేతికి చిక్కినట్లుగా అర్థమవుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్