AP Cabinet Expansion: ఏపీలో రాజకీయంగా అందరూ ఎదురు చూస్తున్న అంశం కేబినెట్ విస్తరణ. జగన్ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపడతారు? ఎవరికి అవకాశం ఇస్తారు? ఎవరిని తొలగిస్తారు? సమీకరణాలు ఏంటీ? అంటూ జోరుగా చర్చ సాగుతోంది. అయితే.. అందుకు ముహూర్తం వచ్చేసిందని అంటున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే కేబినెట్ విస్తరణ జరగనుందనే చర్చ సాగుతోంది. ఈ లోగా.. మంత్రివర్గం జాబితాను జగన్ ఫైనల్ చేయబోతున్నారని టాక్.
వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మంత్రివర్గంలో స్థానం ఆశించిన వారి సంఖ్య వంద మందికిపైనే ఉంది. కానీ.. తొలిసారి పాతిక మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు జగన్. అయితే.. ఆశావహులు అందరినీ సైలెంట్ గా ఉంచడానికి ఓ మంత్రం వేశారు. ఆ మంత్రమే సగం పాలన. ఇప్పుడున్న మంత్రివర్గం సరిగ్గా రెండున్నర సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత మిగిలిన వారికి అవకాశం ఇస్తా అని చెప్పారు. దీంతో.. ఆశావహులకు ఎదురు చూపులు మొదలు పెట్టారు.
అయితే.. ఎంత పక్కాగా డీల్ చేసినా అందరికీ న్యాయం చేయడం అసాధ్యం అన్నది తెలిసిందే. కాబట్టి.. ఎవరికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి? ఎవరిని బుజ్జగించాలి? అనే విషయమై సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. అవసరమైన వారికి మంత్రి పదవులు ఇచ్చి, మిగిలిన వారికి రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతలు ఇస్తామని బుజ్జగించే ఛాన్స్ ఉంది. కానీ.. అంత మందిలో ఆ కొందరిని సెలక్ట్ చేయడం కోసం జగన్ కొత్త పద్ధతిని ఎంచుకుంటున్నారని అంటున్నారు.
ఇప్పటికే.. ఎమ్మెల్యేల పనితీరుపై వచ్చిన ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకోబోతున్నారని సమాచారం. దీంతోపాటు సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీ అవసరాలను కూడా లెక్కలోకి తీసుకోవడం తథ్యం. ఇలాంటివన్నీ క్రోడీకరించి, ఫైనల్ గా మంత్రివర్గంలో స్థానాలు కేటాయించబోతున్నారు. అయితే.. ఇప్పుడున్న కేబినెట్లో తొంభై శాతం మందిని తొలగించి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వబోతున్నారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. మరికొందరు మాత్రం నూటికి నూరుశాతం మార్పు ఉంటుందని అంటున్నారు.
అయితే.. ఎవరిని కాదన్నా.. అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇది ఎలక్షన్ కేబినెట్ గానే పరిగణించాల్సి ఉంటుంది. మరోసారి మంత్రివర్గ విస్తరణ అనేది దాదాపుగా ఉండే ప్రసక్తే లేదు. అంటే.. ఇప్పుడున్న మంత్రులు ఎన్నికలకు కేబినెట్ హోదాలో వెళ్తారు. కాబట్టి.. ఇలాంటి కీలక సమయంలో మంత్రిపదవి కోల్పోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. దీన్ని గురించిన సీఎం ముసుగులో గుద్దులాటలు లేకుండా తేల్చేయబోతున్నారట.
ఇందుకోసం.. మంత్రి పదవి ఆశిస్తున్న ప్రతీ ఎమ్మెల్యేతో జగన్ నేరుగా మాట్లాడనున్నారు. అంతేకాదు.. ఈ సమయంలో మరో నేత ఎవ్వరూ పక్కన ఉండబోరట. సింగిల్ టూ సింగిల్ పద్ధతిలో.. ప్రతీ ఎమ్మెల్యేతో జగన్ స్వయంగా మాట్లాడుతారని తెలుస్తోంది. మంత్రి పదవి ఇస్తే.. ఎలా పనిచేయాలి? ఇవ్వకపోతే.. కారణాలేంటీ? భవిష్యత్ హామీలేంటీ? మంత్రివర్గం నుంచి తొలగిస్తే.. పరిస్థితి ఏంటీ? కొత్త బాధ్యతలు ఏంటీ? అనే కోణంలో.. అందరితో మాట్లాడి, అసంతృప్తి లేకుండా చూడబోతున్నారట. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.