ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై సినీనటుడు సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొలుత సిద్ధార్థ్ పై విష్ణువర్థన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అయితే.. ఇందులో తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు సిద్ధార్థ్.
కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ విఫలమయ్యారని కొన్ని రోజులుగా కామెంట్ చేస్తున్నారు సిద్ధార్థ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సిద్ధార్థ్ పై కామెంట్ చేశారు.
సిద్ధార్థ్ నటిస్తున్న సినిమాలకు మాఫీయా నుంచి డబ్బులు అందుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘సిద్ధార్త్ నటిస్తున్న సినిమాలకు దావూద్ ఇబ్రహీం నిధులు సమకూరుస్తున్నారా? ఆన్సర్ ఇవ్వండి’ అంటూ ట్విటర్ లో పోస్టు చేశారు విష్ణువర్ధన్. దీనికి ఘాటు వ్యాఖ్యలతో రిప్లే ఇచ్చారు సిద్ధార్థ్.
‘లేదు రా. అతడు నా TDS కట్టేందుకు సిద్ధంగా లేడు. నేను పర్ఫెక్ట్ సిటిజన్, టాక్స్ పేయర్ ను కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సిద్ధార్థ్. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరోసారి సిద్ధార్థ్ వర్సెస్ బీజేపీ వార్ మొదలైంది.
సిద్ధార్థ్ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఒక నాయకుడిని పట్టుకొని ‘రా’ అంటూ కించ పరుస్తూ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సిద్ధార్థ్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీపై దాడిచేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కనిపించట్లేదా? అని ప్రశ్నిస్తున్నారు.