Homeజాతీయ వార్తలుకుప్ప కూలుతున్న భారత ఆర్ధిక వ్యవస్థ

కుప్ప కూలుతున్న భారత ఆర్ధిక వ్యవస్థ

గడచినా రెండు దశాబ్ధాలకు పైగా కాలంలో ఎన్నడూ లేనంతగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నది. 1996 తర్వాత స్థూల దేశీయోత్పత్తి 4.5 శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవస్థ పతనావస్థను సూచిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసేలా కేంద్రం వద్ద కనీసం ఒక్క విభిన్న పథకం కూడా కనిపించడం లేదు.

అంతర్జాతీయ మార్కెట్లో మందగమన పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్టంగా జీఎస్టీ అమలు, విదేశీ ఎగుమతుల్లో క్షీణత ప్రభావం వాహన, జౌళి రంగాలపై పడటం, నిర్మాణ, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోవడం వంటి అంశాల కారణంగా దేశ జీడీపీ క్రమక్రమంగా పతనమవుతూ వస్తున్నది. మన దేశంలో ఉత్పత్తి, నిర్మాణ, గనుల రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, వృత్తిపరమైన సేవలు, వ్యక్తిగత వినియోగం వంటివి గణనీయంగా తగ్గముఖం పట్టాయి.

భారత జీడీపీ వరుసగా ఆరు త్రైమాసికాల నుంచి, అంటే ఏడాదిన్నర నుంచి క్షీణిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులు కేవలం రెండు శాతం చొప్పున వృద్ధి చెందాయి. వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 1.9% నుంచి 7.4 శాతానికి పెరుగగా.. వ్యవసాయ రుణాలు 18.3 నుంచి 5.3 శాతానికి, చిన్న, మధ్యతరహా సంస్థలకిచ్చే రుణాలు 6.7 నుంచి 1.6 శాతానికి పడిపోయింది. పారిశ్రామిక సూచి వృద్ధి కూడా 0.6 శాతానికి పరిమితమైంది. దేశంలో దాదాపు ప్రతి భారీ పరిశ్రమ వృద్ధి సున్నా లేదా ప్రతికూలానికి జారుకున్నది.

కొత్త పెట్టుబడుల్ని ఆకర్షించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. 2019 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో కొత్తగా వచ్చిన పెట్టుబడుల వాటా 20.5 శాతం మాత్రమే. 2004 సెప్టెంబరు నుంచి దేశీయ ఆర్థిక స్థితిగతుల్ని క్షుణ్ణంగా గమనిస్తే.. పెట్టుబడుల ఆకర్షణలో ఇంతకంటే క్షీణత లేదనే చెప్పాలి. దీన్నిబట్టి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై విదేశీ సంస్థలకు పెద్దగా నమ్మకం లేకుండా పోయింది.

నిరర్థక ఆస్తుల (మొండి బకాయిలు) విలువ ఎంతలేదన్నా రూ.10 లక్షల కోట్ల దాకా ఉండడంతో బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకు పోతున్నది. దీంతో కొత్త రుణగ్రహీతలకు అప్పులిచ్చే పరిస్థితులు బ్యాంకులకు లేకుండా పోయాయి. పైగా ఇటీవల పలు బ్యాంకుల్ని విలీనం చేయడంతో పెట్టుబడిదారులు, డిపాజిటర్ల మనసులో వ్యతిరేక భావాలు నెలకొన్నాయి. ఒకరకమైన అరాచక వాతావరణం నెలకొన్నది.

మన దేశంలోని 55 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి ఈ రంగ మూ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నది. రైతు పండించిన పంటకు కనీస మద్ధతు ధర లభించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోతల రూపంలో సొమ్మంతా తీసుకెళ్లి రెండు వందల కార్పొరేట్‌ సంస్థల చేతిలో పోస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుందనే భ్రమల్లో కేంద్రం ఉన్నట్టుగా అనిపిస్తున్నది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular