52రోజుల సమ్మె అనంతరం టీఎస్ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటాం అని సీఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే. వారిని విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఆర్టీసీ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. “సొమ్మొకడిది సోకొకడిది” అంటే సొమ్మేమో ప్రజలది సోకేమో కెసిఆర్ ది. ఎందుకంటే సమ్మెలో టీఎస్ఆర్టీసీ కార్మికులు సాధించింది ఏమి లేకపోగా అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ప్రతిపక్షాల మాటలు విని ఆర్టీసీ జేఏసి నేతలు తప్పు దారిలో వెళ్లారనేది వాస్తవం. మరోవైపు కెసిఆర్ కూడా మెట్టు దిగక పోవడంతో పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అంటే కెసిఆర్, జేఏసి నేతలు పంతాలకుపోయి టీఎస్ఆర్టీసీకి వందల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చారని తెలుస్తుంది. మరి ఈ నష్టం ఎవరు భరించాలి అంటే రాష్ట్ర ప్రజలు భరించాలి అని చావు కబురు చల్లగా చెప్పారు మన ముఖ్యమంత్రిగారు. “మన బిడ్డలు” “మన వాళ్ళు” “మనమెలా పోగొట్టుకుంటామంటూ” తియ్య తీయగా మాట్లాడి నష్టాన్ని మొత్తం ప్రజల మీదికి నెట్టారు. కిలోమీటర్ కి 20పైసలే పెంచుతున్నాం అని భలేగా మాట్లాడారు. దానివల్ల ఆర్టీసీ ఏడాదికి 752కోట్లు ఆదాయం చేకూరుతుందని కమ్మగా.. ప్రజలకు దెబ్బ తగలకుండా చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం యాదగిరిలో దేవాలయాన్ని పునర్నిర్మించటం కోసం వందలకోట్ల ప్రభుత్వ ఖజానాన్ని ఖర్చుపెట్టటం ఎంతవరకు సబబు? కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఒక మిస్టరీ. ఎన్ని లక్షల ఎకరాలకు నీరొస్తుందో ఇప్పటికీ తెలియదు. ఇంతగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు.. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచటమే కదా? ఇవన్నీ సరిపోవన్నట్లు మరలా కొత్తగా ప్రజల మీద అదనపు భారం పెట్టటం సబబా? ప్రియమైన ముఖ్యమంత్రిగారు…
ఇకపై తెలంగాణలోని ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్లోనూ కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది.
సెమీ ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు. ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15 పెంచారు. డీలక్స్ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20 పెరగనుంది. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ. 25 పెంచారు. ఇకపై రాజధాని, వజ్ర బస్సులో కనీస ఛార్జీ రూ. 35 పెరగనుంది. గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జీ రూ. 35 పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్లో కనీస ఛార్జీ రూ. 75 పెంచారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్ పాస్ ధరలు కూడా పెరగనున్నాయి. ఆర్డీనరీ బస్ ధర రూ. 950, ఎక్స్ప్రెస్ రూ. 1070, డీలక్స్ రూ. 1185గా ఉండనుంది.