ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ప్రజల్లో భయాందోళనను తగ్గిస్తున్నాయి. శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో కరోనా వైరస్ కు పుట్టగొడుగులతో చెక్ పెట్టవచ్చని తేలింది. శాస్త్రవేత్తలు తొలిసారి ఒక యాంటీవైరల్ ఔషధ ఆహారాన్ని తయారు చేసి సక్సెస్ కావడం గమనార్హం. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఈ ఫుడ్ సప్లిమెంట్ ను తయారు చేసింది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు కరోనా వైరస్ ను కట్టడి చేసే ఔషధాల తయారీలో ఉపయోగపడుతున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు పుట్టగొడుగులను ఉపయోగించి ఫుడ్ సప్లిమెంట్ ను తయారు చేయడం ద్వారా కరోనా సోకిన వాళ్లు త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. స్టార్టప్ కంపెనీ క్లోన్ డీల్స్, సీసీఎంబీ కలిసి ఈ పరిశోధనలు చేశాయి. లిక్విడ్ రూపంలో ఈ ఫుడ్ సప్లిమెంట్ మార్కెట్ లోకి రానుంది.
శాస్త్రవేత్తలు భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి దేశంలో కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్లు, మందులతో పాటు ఫుడ్ సప్లిమెంట్లపై ప్రధానంగా దృష్టి పెట్టారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా వైరస్ బారిన పడితే భవిష్యత్తులో సైతం తీవ్ర ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు త్వరలో కోలుకునే విధంగా ఫుడ్ సప్లిమెంట్లపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.
పసుపు మిశ్రమంతో పుట్టగొడుగులను ఉపయోగించి తయారు చేసే ఫుడ్ సప్లిమెంట్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వచ్చే సంవత్సరం జనవరి నాటికి ఈ ఫుడ్ సప్లిమెంట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.