కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ప్రజలు గతంతో పోల్చి చూస్తే ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవడానికి ప్రయత్నించడంతో పాటు ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఎక్కువగా భోజనం చేసేవాళ్లు సైతం ఇంటి భోజనాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే కొన్ని లక్షణాలు మీలో ఉంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని గుర్తుంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తరచూ దగ్గు, జలుబు సమస్యలు వేధిస్తున్నాయంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని గుర్తుంచుకోవాలి. రాత్రి నిద్రపోయిన తరువాత తరచూ మెలుకువ వస్తున్నా నిద్ర లేచిన తరువాత చురుకుగా పని చేయలేకపోయినా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని భావించాలి. చెవి, సైనస్, మూత్ర సంబంధిత సమస్యలు వేధిస్తున్నా ఇమ్యూనిటీ వీక్ గా ఉందని అర్థం.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వైరస్, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయలేకపోతే తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా శరీరంపై ఏవైనా గాయాలు ఏర్పడితే త్వరగానే గాయాలు మానిపోతాయి. అయితే గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్టు భావించాలి. శరీరం చర్మాన్ని రిపేర్ చేయడానికి అవసరమైన పదార్థాలను అందించడం లేదని గుర్తుంచుకోవాలి.
తరచూ జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నట్టు భావించాలి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే 70 శాతం కణజాలం జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ఇతర శరీర భాగాలు సైతం ఇమ్యూనిటీ పవర్ ను కలిగి ఉంటాయి.