గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ఘన విజయం సాధించడానికి కారణమైన రైతు పధకాన్ని ఎన్నికల అఞ్ఞతరం ప్రభుత్వం నీరు కారుస్తున్నదా? గత ఏడాదిగా ఈ పధకం నత్తనడక నడుస్తూ ఉండడంతో అటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. రాను రాను ఈ పధకాన్ని సహితం ప్రభుత్వం నీట ముంచుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులకు ఇంత చేస్తున్నాం… అంత చేస్తున్నాం.. అంటూ పదేపదే చెప్పకునే రాష్ట్ర ప్రభుత్వం.. రైతులను నిర్లక్ష్యం చేస్తోందా….? అంటే అవుననే అంటున్నారు రైతు సంఘాల నేతలు. పాస్ పుస్తకాలు లేవని కొందరికి, ఉన్నా వివిధ రకాల సాకులతో మరికొందరికి రైతుబందు ఇవ్వడం లేదంటున్నారు.
ప్రభుత్వం వివిధ రకాల కారణాలతో రైతు బంధు సహాయానికి కోతలు పెడ్తుండడంతో ఈ పథకం కొనసాగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నేతలు. రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులుంటే, 41 లక్షల మందికే రైతుబంధు కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మొదట్లో పాస్ బుక్ లున్న 41 లక్షల మందికి ఖరీఫ్, రబీ సీజన్ లో డబ్బులు ఇచ్చారు.
ఆ తర్వాత ఖరీఫ్ లో కొంత ఆలస్యంగా ఖాతాల్లో నగదు వేశారు. రబీకి మరింత ఆలస్యం చేశారు. రైతుబంధు ఇస్తారో లేదోనని రైతులు అయోమయంలో ఉండగా రబీ సీజన్ ముగింపులో డబ్బులు వేశారు. అది కూడా కొంత మందికే వేశారు. పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులను హోల్డ్ లో పెట్టారు. వాళ్లకి ఇస్తారో ఇవ్వరో స్పష్టత లేదు.
గతంలో రైతు బంధు తీసుకున్న వారిలో మరణించిన వాళ్లను, భూములను ఇతరులకు అమ్మిన వాళ్లకు దాదాపు లక్షన్నర మంది రైతులకు రైతు బంధు కోత పడింది. వివిధ కారణాలతో ఆలస్యంగా పాస్ బుక్ లు ఇచ్చిన రైతులకు అసలు రైతుబంధు వర్తిస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు.
అధికారుల తప్పిదంతో పాస్ పుస్తకాలు ఆలస్యంగా వచ్చినా, నష్టం రైతులకే జరుగుతుందని వాపోతున్నారు రైతు సంఘాల నేతలు. లేటుగా పాస్ బుక్ లు వచ్చిన వారిలో చాలా మంది ఐదు ఎకరాల లోపేనని చెబుతున్నారు. ఇప్పటి వరకు రైతుబంధు సహాయం దక్కిన వారిలో ఎక్కువ మంది బడా రైతులే ఉండటం గమనార్హం. రైతు బంధుకు అర్హత ఉన్నా, సవాలక్ష రూల్స్ తో చాలా మందిని అనర్హులుగా చేస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.