ఈ నెలలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాను రాజ్యసభకు పంపనున్నట్లు విశేష ప్రచారం జరిగింది. అయితే, ఇదంతా తన రాజకీయ ప్రత్యర్ధులకు రాజ్యసభ సీట్ ఇవ్వకుండా చేయడం కోసం మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వేసిన ఎత్తుగడగా తెలుస్తున్నది.
ఇప్పటికే సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. అటువంటప్పుడు అదే కుటుంభం నుండి మరొకరిని రాజ్యసభకు పంపడం సాధ్యం కాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పైగా, తమ కుటుంభం సభ్యులకు పార్టీ సీట్లు ఇవ్వాలని వత్తిడి తేవద్దని రాహుల్ గాంధీ చెబుతూనే ఉన్నారు.
ఈ నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ తొమ్మిది సీట్లు గెల్చుకొనే అవకాశం ఉంది. ప్రియాంక వాద్రా పేరును తెరపైకి తీసుకు వచ్చింది మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ కావడం గమనార్హం. వర్మ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు సన్నిహితుడు.
కమలనాథ్ కు నిద్రలేకుండా చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా – ఇద్దరు రాజ్యసభకు వెళ్లాలని అనుకొంటున్నారు. వారిద్దరూ గత లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందారు. అయితే వారిద్దరిని రాజ్యసభకు పంపడం కమల్ నాథ్ కు ఇష్టం లేదు. అందుకనే ప్రింయంకాను మధ్యప్రదేశ్ కు వచ్చి రాజ్యసభకు పోటీ చేయమని చెబుతున్నారు.