ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత అర్ధరాత్రి పది నిమిషాల వ్యవధిలో పది జీవోలను రహస్యంగా విడుదల చేసి రికార్డు నెలకొల్పింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకమైన జీవోలు ఎక్కువగా అర్ధరాత్రి బైటకు వస్తుండటం తెలిసిందే. అయితే వాటి వివరాలు బైటకు రాలేదు.
రాత్రి 11:45 గంటల నుంచి 11:55 మధ్య పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ జీవోలను విడుదల చేసింది. యాభై శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అర్ధరాత్రి ఈ జీవోలను విడుదల చేయడం గమనార్హం.
59.85 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా ఆర్డినెన్స్ లేదంటే జీవోలలో ఏదో ఒకటి తెచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రహస్యంగా ఈ జీవోలను తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
మున్ముందు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో వీటిని విడుదల చేసినట్టు చెబుతున్నారు. నేటి మంత్రి వర్గ సమావేశంలో రిజర్వేషన్లపై చర్చించి, ఆమోదించే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లను 50 శాతానికి కుదించి జీవోలు తెచ్చి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.