Homeఎంటర్టైన్మెంట్Ticket rates: తెలంగాణలో పెరిగిన టికెట్ల రేట్లు.. వెనక్కి తగ్గని ఏపీ?

Ticket rates: తెలంగాణలో పెరిగిన టికెట్ల రేట్లు.. వెనక్కి తగ్గని ఏపీ?

Increased Ticket rates: రెండు తెలుగు రాష్ట్రాలు టాలీవుడ్ కు రెండు కళ్ల లాంటివి. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ కేంద్రంగా ఎదిగిన సంగతి అందరికీ తెల్సిందే. నైజాం, సీడెడ్, ఆంధ్రా ఏరియాలుగా సినిమా పంపిణీ ఎప్పటి నుంచో జరుగుతోంది. కలెక్షన్ల పరంగా అన్ని ప్రాంతాలు తెలుగు సినిమాలను బాగా ఆదరిస్తుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మూడుపువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా మారిపోయింది.

cinema-vs-ap-govt-on-movie-ticket-price

అయితే కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ఈ సమయంలో థియేటర్లు, షూటింగు నిలిచిపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కుదేలైంది. అప్పటికే పూర్తి చేసుకున్న చిన్న సినిమాలకు ఓటీటీలు కేరాఫ్ గా మారాయి. దీంతో కరోనా సమయంలో చిన్న నిర్మాతలు ఒకింత సేఫ్ అయ్యారు. అయితే పెద్ద సినిమాల విషయంలో మాత్రం ఓటీటీలు వర్కౌట్ కాలేదని చెప్పొచ్చు.

ఈనేపథ్యంలో వారంతా థియేటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కరోనా ఆంక్షల మధ్య ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు రావడం మానేశారు. ఈ ప్రభావం కలెక్షన్లపై భారీగా పడింది. ఇప్పుడిప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లకు వచ్చి సినిమాలను చూస్తున్నారు.

అగ్రహీరోల సినిమాలు ఇటీవల వరుసగా విడుదలవుతుండటంతో ఫ్యాన్స్ అంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలోనే జగన్ సర్కారు టాలీవుడ్ ను పిడుగుపాటుకు గురిచేసింది. టికెట్ల రేట్లను గణనీయంగా తగ్గించడంతోపాటు బెనిఫిట్ షోను రద్దు చేసింది. ఆన్ లైన్ టికింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో థియేటర్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదంటూ కఠిన చర్యలను తీసుకుంటోంది.

రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లను తనిఖీ చేస్తూ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారంటూ వందలాది థియేటర్లను సీజ్ చేస్తున్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీపై ప్రభావం చూపుతోంది. హీరోల దగ్గరి నుంచి దర్శకుడు, నిర్మాతల వరకు ప్రతీఒక్కరు సర్కారు చర్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని సీని పెద్దలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణ సర్కారు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీపై సాప్ట్ కార్నర్ చూపిస్తోంది. కరోనా కారణంగా సినీ కార్మికులు ఇబ్బందులు పడినపుడు నాడు ప్రభుత్వం అండగా నిలిచింది. సీని పెద్దలతో కలిసి తనవంతు సహకారం కళాకారులకు అందించింది. అలాగే ఇండస్ట్రీలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది.

తెలంగాణ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లను పెంచుతూ టాలీవుడ్ ఇండస్ట్రీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గతంలో కంటే భారీగా టికెట్లను పెంచిన సర్కారు జీఎస్టీని సైతం ప్రేక్షకులపైనే వేయడం విశేషం. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్దగా విమర్శలు రావడం లేదు. ఏపీలో వచ్చిన వివాదాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలోని ప్రతిపక్షాలు మౌనంగా ఉంటున్నాయి.

వినోదం అనేది నిత్యావసరం వస్తువు కాదని ఆ పార్టీలు గుర్తించడం వల్లే వారంతా సినిమా టికెట్ల రేట్లపై పెదవి విప్పడం లేదని తెలుస్తోంది. ప్రేక్షకులు తమకు నచ్చితే సినిమా చూస్తారు.. లేదంటే చూడరు.. సినిమా టికెట్లు ఎక్కువగా పెంచితే సినిమా చూసే వారి సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాని వల్ల నష్టపోయేది ఇండస్ట్రీనే. దీనిని గుర్తించే ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో పెద్దగా స్పందించడం లేదని తెలుస్తోంది.

అయితే జగన్ సర్కార్ ఉద్దేశం వేరే కావడంతోనే అధికార బలంతో ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే విమర్శలు ఇండస్ట్రీ నుంచి విన్పిస్తున్నాయి. జగన్ సర్కారు ఇప్పటికైనా సినిమా టికెట్ల విషయంలో మొండిగా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తేనే మంచిదని పలువురు సూచిస్తున్నారు. మరీ దీనిపై ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే..!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular