కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా ఇండస్ట్రీ ముందు వరసలో ఉంటుంది. ఎక్కడికక్కడ షూటింగులు ఆగిపోవడంతో నిర్మాతలపై వడ్డీల భారం పడింది. ఇటు కార్మికులకు ఉపాధి కరువైపోయింది. థియేటర్లకు జనం వచ్చే పరిస్థితి లేకపోవడంతో అవి కూడా మూతపడ్డాయి. ఈ విధంగా ఇండస్ట్రీకి అన్నివైపులా నష్టాలే. ఈ భారాలు మోయలేక పలువురు నిర్మాతలు 50 శాతం ఆక్యుపెన్సీ సమయంలోనే సినిమాలను రిలీజ్ చేసుకున్నారు. మరికొందరు ఓటీటీలను ఆశ్రయించారు. జనవరి నుంచి మార్చి వరకు మాత్రమే తెరుచుకున్న థియేటర్లు.. ఏప్రిల్ లో సెకండ్ వేవ్ దూసుకు రావడంతో.. అర్ధంతరంగా మూతపడ్డాయి. ఇప్పటి వరకు తెరుచుకోలేదు. మరి, ఈ ఆరు నెలల్లో తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటీ? ఎన్నిసినిమాలు విడుదలయ్యాయి? ఎన్ని విజయం సాధించాయి.. ఎన్ని విఫలమయ్యాయి? అన్నది చూద్దాం.
2021లో ఇప్పటి వరకు థియేటర్లో, ఓటీటీలో కలిపి మొత్తం 54 సినిమాలు విడుదలయ్యాయి. మొదటగా.. జనవరిలో సంక్రాంతిని టార్గెట్ చేసుకొని నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో విజయ్ ‘మాస్టర్’ డబ్బింగ్ కేటగిరీలో పడేస్తే.. అల్లుడు అదుర్స్, రెడ్, క్రాక్ సినిమాలు స్ట్రయిట్ మూవీస్. ఇందులో క్రాక్ మాత్రమే సూపర్ హిట్ కొట్టింది. మొత్తంగా ఈ నెలలో 14 సినిమాలు వచ్చాయి. కానీ.. క్రాక్ మాత్రమే ప్రాఫిట్ లో నిలిచింది.
ఆ తర్వాత ఫిబ్రవరిలోనూ 14 చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో జాంబి రెడ్డి ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత అల్లరి నరేష్ ‘నాంది’ చిత్రం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది. ఎంతో కాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అల్లరోడికి మంచి బ్రేక్ ఇచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘ఉప్పెన’ సంచలనం సృష్టించింది. వసూళ్లు సునామి సాధించింది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ కేటగిరీలో ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పాడు. ఇక మిగిలిన చిత్రాలన్నీ నామమాత్రంగానే వచ్చి వెళ్లాయి.
ఇక, మార్చి సంగతి చూస్తే.. ఈ నెలలో మొత్తం 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో.. రంగ్ దే పర్వాలే దనిపించింది. అంచనాల మధ్య రిలీజ్ అయిన అరణ్య ఉసూరుమనిపించింది. కానీ.. పెద్దగా అంచనాల్లే కుండా వచ్చిన ‘జాతి రత్నాలు’ దుమ్ము లేపింది. రీజన్ లేని కామెడీకి జనాలు ఫిదా అయిపోయారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ అద్దిరిపోయే కలెక్షన్లు సాధించింది ఔరా అనిపించింది.
ఏప్రిల్ నుంచి కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో రిలీజులకు బ్రేకులు పడ్డాయి. ఏప్రిల్ నెలలో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. ఇందులో అంచనాలతో వచ్చిన నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఆ తర్వాత వచ్చిన పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేలా ఓపెనింగ్స్ సాధించింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్ బయటకు రాలేదుకానీ.. వంద కోట్లకు దగ్గరలో ఉన్నాయని టాక్. ఈ సినిమా థియేటర్లో ఉండగానే.. సెకండ్ వేవ్ విజృంభించడంతో.. అర్ధంతరంగా థియేటర్లు మూసేశారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ తర్వాత థియేటర్లో సినిమా రిలీజ్కాలేదు.
మేలో మూడు చిత్రాలు, జూన్లో రెండు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘సినిమా బండి’ ఫర్వాలేదనిపించగా.. ‘ఏక్ మినీ కథ’ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ.. చక్కటి మెసేజ్ తో వీక్షకులను అలరించింది. ఈ విధంగా.. ఈ ఆరు నెలల్లో తెలుగు సినిమా రెగ్యులర్ సక్సెస్ రేట్ నే సొంతం చేసుకున్నప్పటికీ.. థియేటర్లు మూతపడడం ద్వారా కలెక్షన్లలో తేడా కొట్టింది. జనవరిలో 50 శాతం ఆక్యుపెన్సీతో కోత పడగా.. వకీల్ సాబ్ వంటి చిత్రాలకు థియేటర్ల మూతతో షాక్ తగిలింది. అత్యంత కీలకమైన సమ్మర్ సీజన్ ను మొత్తం మింగేసింది. కరోనా గోల లేకుంటే.. బడా చిత్రాలన్నీ మేలో రిలీజ్ అయ్యేవి. బాక్సాఫీస్ కళకళలాడేది. మొత్తంగా.. కరోనా రెండోసారి కూడా గట్టిదెబ్బే తీసింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tollywood six months review
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com