కరోనా వైరస్ సమాజంలో చాలా మార్పు తెచ్చింది. ప్రజల అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఈ వైరస్ ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్ ప్రణాళికలు, ప్రయాణాలు, ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. కరోనా దెబ్బకు అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. చిత్రీకరణ పూర్తయిన సినిమాలను విడుదల చేసే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు వందలు, వేల కోట్ల నష్టం చవిచూస్తారని అంచనా వేస్తున్నారు. షూటింగ్స్ ఆగిపోయిన చిత్రాల విషయంలో కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇక, ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత కొత్త సినిమాలను ఇప్పట్లో ప్రారంభించేది లేదంటూ దిల్ రాజు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. మరో ప్రముఖ నిర్మాత సురేష్బాబు కూడా దిల్ రాజు బాటలో నడవాలని నిర్ణయించుకున్నారట. ఇప్పట్లో కొత్త సినిమాలను ప్రొడ్యూస్ చేసే ఆలోచనే లేదని చెప్పారట. అదే సమయంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా ఇప్పట్లో ప్రారంభించకూదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మాణలో.. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రంతో పాటు మరో రెండు మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. కరోనా కారణంగా షూటింగ్స్కు బ్రేక్ పడింది. అయితే, కరోనా వ్యాప్తి రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు వాటి చిత్రీకరణ తిరిగి ప్రారంభించబోరని తెలుస్తోంది.
మరో వైపు రాజమౌళి కూడా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తిరిగి ప్రారంభించే విషయంలో వెనకడుగు వేశారట. లాక్డౌన్ రూల్స్ పాటిస్తూ తొలుత మాక్ షూటింగ్ చేయాలని అనుకున్నారు. హైదరాబాద్లో రోజూ వందల కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో షూటింగ్కు వెళ్లే సాహసం చేయకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుందట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న యూనిట్లో ఏ ఒక్కరికి వైరస్ సోకినా.. అందరికీ ముప్పు ఉంటుందని చాలా మంది దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే షూటింగ్స్ను మొదలు పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు.