కరోనాతో ఎఫెక్ట్ తో లాభపడిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఒక్క ఓటీటీలేనని బల్లగుద్ది చెప్పొచ్చు. గత ఆరేడు నెలలుగా థియేటర్లు మూతపడటం ఓటీటీలకు బాగా కలిసొచ్చింది. థియేటర్లు మూతపడటంతో గత్యంతరంలేక కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. ఓటీటీలు అడిగిన ధరకే నిర్మాతలు సినిమాలు అమ్ముకోవాల్సి రావడంతో వాటి నిర్వాహాకులు భారీగా లాభపడ్డారు.
అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. అయితే 50అక్యుపెన్సీ నిబంధన థియేటర్ యాజమానులకు ఇబ్బందిగా మారింది. ఇలా చేస్తే తమకు నిర్వహాణ ఖర్చులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రేక్షకులు సైతం థియేటర్లు వెళ్లేందుకు ఇష్టపడం లేదని తెలుస్తోంది.
థియేటర్లకు వచ్చిన ఈ గడ్డుపరిస్థితిని కూడా ఓటీటీలు సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. థియేటర్ల కంటే ముందుగానే ఓటీటీల్లోనే కొత్త సినిమాలు ఇబ్బడిముబ్బడిగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే ఓటీటీలో వి.. నిశబ్ధం.. పెంగ్విన్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఇక నవంబర్ నెలలో దీపావళికి ముందుగా ఓటీటీలు పండుగ కళ తెస్తున్నాయి. ఈనెలలో ఏకంగా ఏడు తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నట్లు ప్రకటించాయి.
నవంబరు 4న ‘మిస్ ఇండియా’ నెట్ ఫ్లిక్స్లో.. నవంబర్ 12న ‘ఆకాశం నీ హద్దురా’.. 20న ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ నవంబర్ 6న `గతం` అనే చిన్న సినిమాని అమేజాన్ లో రిలీజు కానున్నాయి. నవంబరు 13న ‘మా వింత గాధ వినుమా’.. ‘అనగనగా అతిథి’ సినిమాలు ఆహాలో రాబోతున్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషా చిత్రాలు మరో పది వరకూ నవంబర్లోనే రిలీజ్ కానుండటం దీపావళిని ఓటీటీలు ముందే షూరు చేసినట్లు కన్పిస్తుంది.