Kalyan Ram: ఏపీ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు దుర్భషలాడుకుంటూ… రాజకీయాల్లోకి కుటుంబ సభ్యుల పేర్లు తీసుకురాడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన భార్య గురించి వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీరు పెట్టడం తెలిసిందే. అందుకు గాను నందమూరి బాలకృష్ణ సైతం వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకూ సహించాం భరించాం… ఎప్పుడైనా ఆవేశం వస్తే చంద్రబాబు ఆలోచించి మమ్మల్ని ఆపేవారు. ఇక ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకునేది లేదంటూ బాలాకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఆడవారి గురించి ఎవరైనా మాట్లాడినా హద్దు మీరి ప్రవర్తించినా… నోటికొచ్చినట్లు వాగినా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ సైతం తాజాగా స్పందించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ రామ్ ఒక పోస్ట్ చేశారు. `అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురు కావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా` అని కళ్యాణ్ తెలిపారు.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 20, 2021
ఈ సందర్భంగా తాత ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్లను పంచుకున్నారు కళ్యాణ్ రామ్. ”యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.. యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:” అంటూ ట్విట్ చేశారు.