మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు అంటే ప్రాణం. ఎప్పుడూ అభిమానుల యోగక్షేమాలు అడిగి తెలుసుకునే చిరుకి ఓ వీరాభిమాని కరోనాతో కన్నుమూశారని తెలిసి ఆవేదన చెందారు. ఆ అభిమాని పేరు యర్రా నాగబాబు. ఈయనకు చిరంజీవి అంటే ప్రాణం. మెగాస్టార్ ప్రేరణతోనే యర్రా నాగబాబు కోనసీమ ఐ బ్యాంక్ను ప్రారంభించారు. మెగాస్టార్ ఐ బ్యాంక్ స్ఫూర్తితోనే తానూ కోనసీమ ఐ బ్యాంక్ను ప్రారంభించానని ఎప్పుడు ఈయన చెబుతూ ఉండేవారట.
తన అభిమాని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త తెలిసిన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. చిరు తన మనసులోని బాధను చెబుతూ ‘యర్రా నాగబాబు నా వీరాభిమాని. నా పిలుపు మేరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి గర్వకారణంగా నిలిచిన వ్యక్తి. మా ఐ బ్యాంక్ను ఆదర్శంగా తీసుకుని కోనసీమ ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతో సేవ చేశాడు. చూపు లేని ఎంతోమందికి యర్రా నాగబాబు కంటిచూపును ప్రసాదించాడు. అలాంటి యర్రా నాగబాబు కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం చాలా బాధాకరం.
కొద్ది రోజుల క్రితం నేను తనతో మాట్లాడినప్పుడు ఎంతో భరోసాగా మాట్లాడాడు. కానీ దురదృష్టవశాత్తూ అతడిని పోగొట్టుకున్నాం. అతడి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. సారీ నాగబాబు, మిస్ యూ’ అని మెగాస్టార్ ఎమోషనల్ గా చెప్పి తన అభిమానికి సంతాపాన్ని ప్రకటించారు.
కరోనా కారణంగా ఈ విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడం చిరుని ఇంకా బాధ పెట్టింది. గత కొద్ది రోజులుగా యర్రా నాగబాబు కరోనా చికిత్స తీసుకుంటున్నా ఆయన ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించినా వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.