టాలీవుడ్ దేవసేన అనుష్క శెట్టిని తెరపై చూసి చాలా కాలం అవుతోంది. బాహుబలి తర్వాత భాగమతితో ప్రేక్షకుల ముందుకొచ్చిందామె. అది విడుదలై రెండేళ్లు అవుతోంది. గతేడాది సైరా నరసింహా రెడ్డిలో అతిథి పాత్ర చేసింది. సాధారణంగానే ఆచితూచి సినిమాలు చేసే స్వీటీ కథ నచ్చితే ప్రాణం పెట్టి నటిస్తుంది. నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు పెట్టింది పేరైన అనుష్క ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. మాధనవ్ కీలక పాత్ర పోషించాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కరోనా కారణంగా సాధ్యం కాలేదు. మూగ ఆర్టిస్ట్గా నటించిన ఈ సినిమాపై అనుష్క భారీ అంచనాలు పెట్టుకుంది. ఇలాంటి పాత్ర చేయడం ఆమెకు ఇదే తొలిసారి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ లో ఆమె అద్భుతంగా నటించిందని తెలిసిపోయింది. దాంతో, అనుష్కను తెరపై చూసేందుకు ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: నిర్మాతగా టాలెంటెడ్ బ్యూటీ.. గెస్ట్ రోల్ లో కూడా !
కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడడంతో ఈ మధ్య పలు చిత్రాలు ఓటీటీల బాట పడుతున్నాయి. దాంతో, నిశ్శబ్దం మూవీని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలని పలువురు సూచించారు. కానీ, ఇది థియేటర్లో చూపించాల్సిన సినిమా అని చిత్ర నిర్మాత, కథ అందించిన కోన వెంకట్ ఇది వరకే స్పష్టం చేశాడు. కానీ, ఫస్ట్ కాపీ రెడీ అయి నెలలు గడవడం, థియేటర్లు ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించకపోవడంతో కోన బెట్టు వీడాడు. రిలీజ్ విషయంలో అతను మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. దాంతో, ఈ సినిమాను ఎలా రిలీజ్ చేయాలో చెప్పాలంటూ అభిమానుల సలహా కోరుతున్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోల్ పెట్టాడు. ‘థియేటర్ల కోసం జనవరి, ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే నిశ్శబ్దం సినిమాకు మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు?’ అంటూ థియేటర్లు, ఓటీటీ, ఎక్కడైనా సరే అని మూడు ఆప్షన్లు ఇచ్చాడు. కాగా, మెజారిటీ నెటిజన్లు ఓటీటీకే ఓటు వేశారు. కొంతమంది మాత్రం అనుష్క పెర్ఫామెన్స్ను వెండితెరపైనే చూడాలని అంటున్నారు. మరి, వెంకట్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.