ఉపాధ్యాయ వృత్తి కొందరి కల. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఏళ్ల తరబడి యుద్ధం చేస్తూనే ఉంటారు. అయితే.. డీఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించడానికన్నా ముందు వీరు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) తో కుస్తీ పట్టాల్సి ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. సరేలే అనుకొని ఆ పరీక్ష పాసైనప్పటికీ.. దానికి కూడా కాల పరిమితి ఉంది.
ఒకసారి టెట్ పాసైనవారు ఏడేళ్ల వరకే అర్హులు. ఆలోపు టీచర్ జాబ్ సంపాదించుకోవాలి. లేదంటే.. మళ్లీ టెట్ పాస్ కావాల్సిందే. అసలే.. ప్రభుత్వాలు టీచర్ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తాయో ఎవ్వరికీ తెలియదు. దానికంటూ ఉద్యోగ క్యాలెండర్ వంటివి ఏదీ లేకపోవడంతో.. ప్రభుత్వాలు వేసినప్పుడే ఉద్యోగాలు అన్నట్టుగా మారిపోయింది. ఈ లోపు.. వారి టెట్ పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. ఇలా ఎంతో మంది రెండు, మూడు సార్లు టెట్ తో కుస్తీ పట్టాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ పరీక్షకు విధించిన ఏడేళ్ల కాలపరిమితిని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే.. ఒకసారి టెట్ పాసైతే.. లైఫ్ లాంగ్ వర్తిస్తుంది. అంటే.. ఇక నేరుగా డీఎస్సీతో యుద్ధం చేస్తే సరిపోతుందన్నమాట. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.
ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ రాష్ట్రాలను కోరారు. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని భావించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందన్న ఆయన.. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ నిర్ణయం ఇప్పటికే టెట్ కంప్లీట్ చేసిన వారికి కూడా వర్తిస్తుంది. ఎప్పటి నుంచి అంటే.. 2011 నుంచి టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ నిర్ణయం వర్తించనుంది.