Savita Pradhan IAS: జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిందే. ఎవరికి లైఫ్ ఈజీ కాదు. అదే విధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐఏఎస్ అధికారి లైఫ్ కూడా అలాంటిది. ఆమె ఎవరో కాదు సవిత ప్రధాన్. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈమె జీవితం చాలా కష్టాలతో సాగింది. మండై గ్రామంలో పుట్టిన సవితకు ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల స్కాలర్షిప్ లతోనే చదివేది. వారి గ్రామంలో పదవ తరగతి పూర్తి చేసిన మొదటి అమ్మాయి గా నిలిచింది.
స్కూల్ చాలా దూరంగా ఉండటం వల్ల ఈమె స్కూల్ కు దగ్గరగా ఒక చిన్న ఉద్యోగం చూసుకుంది సవిత తల్లి. ఈమెకు సైన్స్ అంటే ఇష్టం. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలి అనుకుంది. అయితే ఈమెకు 16 సంవత్సరాల వయసులో ఒక సంబంధం వచ్చింది. ఈమె కంటే 11 సంవత్సరాలు పెద్ద భర్త. పెళ్లి చూపుల్లోనే దురుసుగా ప్రవర్తించారట భర్త. దీంతో సవిత వద్దని చెప్పిందట. కానీ పెద్దింటి వారు అని నచ్చజెప్పారట. ఆమెకు అత్తింట్లో చాలా ఇబ్బందులు వచ్చాయట. అందరూ తిన్న తర్వాతనే తినాలి.
తినడానికి ఏం లేకపోతే మళ్లీ వాడుకోకూడదు. నలుగురిలోకి వెళ్లకూడదు. తల మీద కొంగు తీయవద్దు. ఎక్కువగా నవ్వద్దని, టీవీ చూడవద్దని చాలా నిబంధనలు పెట్టేవారు. తప్పితే భర్త చేతిలో తన్నులు మస్ట్ గా ఉండేవట. ఇవన్నీ భరించలేక చనిపోదాం అనుకుందట సవిత. కానీ అదే సందర్భంలో ఆమె గర్భవతి అని తెలియడంతో తల్లికి విషయం చెప్పిందట. కానీ బిడ్డ పుట్టాక అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని నచ్చజెప్పిందట తల్లి. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా పరిస్థితి మారలేదట.
పరిస్థితులు భరించలేక ఒకరోజు ఫ్యాన్ కు చీరను కట్టుకుందట చనిపోవాలని.. కిటీకీలో నుంచి అత్తమామ చూస్తున్న వద్దని చెప్పలేదట. అందుకే ఇలాంటి వారి మధ్య తన జీవితం పాడు చేసుకోవడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్లిపోయింది సవిత. కానీ ఈమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కొట్టేవారట అత్తింటి వారు. వీరి మీద కంప్లైంట్ చేసి విడాకులు తీసుకుంది..ఆ తర్వాత మరొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సవిత. హర్ష అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె జీవితంలో మార్పు వచ్చిందట.
హిమ్మత్ వాలి లడికియా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టారు. తన జీవితం గురించి అందులో చెప్తూ చాలా మందికి ధైర్యం ఇచ్చింది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయట. దీంతో ఒక బ్యూటీ పార్లర్ లో అసిస్టెంట్ గా పని చేసింది. ఇంట్లో వంట పనులు చేయడం మాత్రమే కాదు చిన్న పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్పేది. ఇవన్నీ చేస్తూనే బీఏ పరీక్షలు రాసింది. ఆ తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. ఈమె తల్లి కూడా సహాయం చేయడంతో ఒకసారి యూపీఎస్సీ నోటిఫికేషన్ కనిపించడంతో అది చూసి సాధించాలి అని కష్టపడి చదివింది. అలా 24 సంవత్సరాలకే మున్సిపల్ ఆఫీసర్ అయింది. సవిత జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే కాదు ఆమెలాగా బతకాలని చాలా మంది అనుకుంటున్నారు కూడా.