గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కోట్ల సంఖ్యలో యువతకు ప్రయోజనం చేకూర్చేలా శుభవార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ఐబీపీఎస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 3,517 పీవో, మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు.
ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న యువతకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుందని చెప్పవచ్చు. ఐబీపీఎస్ కొన్ని రోజుల క్రితమే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 1167 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఐబీపీఎస్ తాజాగా పాత నోటిఫికేషన్ తో పాటు మరో నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. నవంబర్ నెల 11వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఉద్యోగాలకు తగిన విద్యార్హత ఉన్నవారు, ఆగష్టు నెల 5వ తేదీలోపు ఐబీపీఎస్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోని వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు హాజరైన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో కెనరా బ్యాంక్ లో 2,100 యుకో బ్యాంక్ లో 350, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 734, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 250, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో 83 ఖాళీలు ఉన్నాయని సమాచారం.