Cyber Crime : దొంగలు కూడా రోజురోజుకూ అప్గ్రేడ్ అవుతున్నారు. అందివచ్చిన సాంకేతికతను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కేవలం ఆన్లైన్ను నమ్ముకొని మోసాలకు పాల్పడుతున్నారు. లక్షలకు లక్షలు కొల్లగొడుతున్నారు. బ్లాక్ మెయిల్కు పాల్పడుతూ డబ్బుల కోసం పీడిస్తున్నారు. అయితే.. బాధితుల ప్రైవసీ సమాచారం వారికి ఎలా తెలుస్తోంది..? ఫొటోలు, నంబర్లు వారికి ఎలా పోతున్నాయా..? అనేది ఆలోచిస్తే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే అని చెప్పాలి. అయితే.. సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఈ తరహా దోపిడీకి పాల్పడుతుంటే ప్రజల్ని ఎవరు కాపాడాలనే చర్చ నెట్టింటా నడుస్తోంది.
ఎవరికైనా మన ఫోన్ నంబర్ కానీ.. మన బ్యాంక్ ఖాతా నంబర్ కానీ.. మన ఆధార్ నంబర్ కానీ చెబితే కానీ తెలిసే పరిస్థితి ఉండదు. కానీ.. సైబర్ నేరగాళ్ల దగ్గర మాత్రం ఫోన్ నంబర్ నుంచి.. ఆధార్, ఖాతా నంబర్లూ ఉంటాయి. అలాగే.. క్రెడిట్ కార్డు నంబర్లు సైతం వారి దగ్గర కోకొల్లలు. అందుకే.. వారు ఈజీగా ఫ్రాడ్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరి అకౌంట్లలో డబ్బులు ఉన్నాయి.. ఎవరి క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ ఎక్కువగా ఉందో వెతుకుతూ మరీ సెలక్టెడ్ నంబర్లకు కాల్స్ చేస్తున్నారు.
సామాన్య ప్రజల నుంచి బడాబాబుల వరకూ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. ఒకరు లక్ష పోగొట్టుకున్నారని.. ఒకరు 20 లక్షలు కోల్పోయారంటూ నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. చదువుతూనే ఉన్నాం. అయినప్పటికీ ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు ప్రజలు అదే ఆశతో తమ వివరాలన్నింటినీ వారికి ఇస్తున్నారు. అధిక డబ్బు ఆశ చూపుతుండడంతో ఆవేశానికి పోతున్నారు. డ్రగ్స్ పేరు చెప్పి కూడా పలు మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగుచూస్తున్నాయి. ఇలా నిత్యం మోసపోతున్న వారి సంఖ్యకు లెక్కలేకుండా పోతోంది.
మరి.. సైబర్ నేరగాళ్లు ఈ స్థాయిలో ఛాలెంజ్ విసురుతున్నా వారిని అరికట్టలేకపోతున్నారు. కేవలం.. సైబర్ నేరగాళ్ల ఫోన్లు లిఫ్ట్ చేయకుండా.. వారితో మాట్లాడకుండా ఉంటే సరిపోతుందని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఫోన్ నంబర్పై పోలీసులు నిఘా పెట్టలేకపోయినా.. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై మాత్రం వారికి ఓ అవగాహన ఉంటుంది. అంతేకాకుండా ప్రతీ మొబైల్ నంబర్కు ఆధార్ లింక్ అయి ఉంటుంది. అలా కూడా అరికట్టలేకపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. పరోక్షంగా నేరగాళ్లకే పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైబర్ క్రైమ్ను నివారించాల్సిన ప్రభుత్వాలు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాంటిప్పుడు ప్రభుత్వాలను ఎన్నుకొని ఎందుకనే ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More