కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. లక్షణాలు కనిపించని వాళ్లతో పాటు కనిపించిన వాళ్లకు సైతం కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. కరోనా సోకి హొం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లలో చాలామంది ఆహారం విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకు సత్యసాయి సేవా సంస్థ, హోప్ స్వచ్ఛంద సంస్థ శుభవార్త చెప్పాయి. స్విగ్గీ, బిగ్ బాస్కెట్ సంస్థలు ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం, సరుకులు పంపిణీ చేయగా ప్రస్తుతం సత్యసాయి సేవా సంస్థ, హోప్ స్వచ్ఛంద సంస్థతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరో రెండు రోజుల్లో సేవా ఆహార్ యాప్ ద్వారా కూడా సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ఈ సేవలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అందుబాటులో ఉన్నాయి.
త్వరలో దాతలు, ఫుడ్ డెలివరీ సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. 7799616163 నంబర్ కు ఉదయం 7 గంటల లోపు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఆహారం పొందవచ్చు. ఆర్డర్ సమయంలో రోగి పేరు, నివసిస్తున్న ప్రాంతం, కాంటాక్ట్ నంబర్, ఇంట్లో ఎందరు పాజిటివ్ అయ్యారు? వివరాలను పంపాల్సి ఉంటుంది. వీళ్లకు 5 రోజులు ఉచితంగా ఆహారం అందుతుంది.
రోజుకు 1,000 నుంచి గరిష్టంగా 2,000 మందికి నాణ్యమైన ఆహారాన్ని సత్యసాయి సేవా సంస్థ, హోప్ స్వచ్ఛంద సంస్థ అందించనున్నాయి. వృద్ధులు, చిన్నారులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.