అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. ఆగస్టులో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఆగస్టు 13న స్లాట్ కూడా బుక్ చేశారు. కానీ.. ఇప్పుడు సినిమా వాయిదా పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో సినిమా ఇండస్ట్రీ మళ్లీ కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక రోజు నమోదయ్యే కేసులు లక్షన్నరకు పైగా దాటిపోవడం.. కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో.. రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మరోసారి 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం అమలు కావొచ్చని అంటున్నారు.
ఇదిలాఉంటే.. జనాల్లో కూడా భయం మొదలైంది. థియేటర్ కు రావడానికి చాలా మంది సంశయిస్తున్నారు. మూడ్నాలుగు వారాలు ఆగితే.. సినిమా ఓటీటీలో వచ్చేస్తుందని చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు.
ఈ క్రమంలోనే పుష్ప చిత్రం కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 16న రావాల్సిన ‘లవ్ స్టోరీ’, 23న రావాల్సిన ‘టక్ జగదీష్’ వాయిదా పడగా.. 30న రిలీజ్ కావాల్సిన ‘విరాట పర్వం’ కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఇక, మే నెలలో రావాల్సిన ఆచార్య, నారప్ప వంటి చిత్రాలు కూడా వెనక్కు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు.
ఇదే కోవలో ఆగస్టు 13న రావాల్సిన పుష్పను కూడా వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 17న ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. మరి, ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.