Ola Electric: ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిలో సమస్యలు రావడం సాధారణం. కానీ కొన్ని కంపెనీలు వీటి పరిష్కారానికి వారంటీ ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత వినియోగదారులు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఓ సమస్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వినియోగదారుడికి వచ్చింది. అయితే అతడు కంపెనీని సంప్రదిస్తే పట్టించుకోకపోవడంతో కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కంపెనీకి కన్జ్యూమర్ కోర్టు భారీగా జరిమానా విధించింది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలి?
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన ఎం మురళీ మోహన్ అనే న్యాయవాది 2022 అక్టోబర్ లో ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేశాడు. దీనిపై 3 ఏళ్ల వారంటీని ఇచ్చారు. అయితే కొన్ని రోజులకే స్కూటర్ డిక్ లాక్ పాడైపోయింది. దీంతో అతడికి తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అతడు మెయిల్ ద్వారా కంపెనీని సంప్రదించినా పట్టించుకోలేదు. ఆ తరువాత ఆయన 2025లో లీగల్ నోటీసులు పంపాడు.
ఈ నోటీసులపై నిర్లక్ష్యంగా ఉండడంతో కన్జ్యూమర్ కోర్టు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి రూ. 45,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో వాహనదారుల్లో కొత్త భరోసాను నింపింది. డిక్కీ లాక్ వంటి చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేసినందుకు, వారంటీ పరిధిలో ఉన్నా సేవలు అందించనందుకు కోర్టు ఈ విలక్షణ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో, అసలు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి వారంటీలు లభిస్తాయి? వినియోగదారుల కోర్టును ఎలా ఆశ్రయించాలి?
ఎలక్ట్రిక్ వాహనాలకు లభించే ప్రధాన వారంటీలు
సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వారంటీ విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. అందుకే కంపెనీలు దీనికి ప్రత్యేకంగా 3 నుండి 8 సంవత్సరాల వరకు లేదా ఒక నిర్దిష్ట కిలోమీటర్ల పరిమితి వరకు వారంటీ ఇస్తాయి.వాహనాన్ని నడిపించే ఎలక్ట్రిక్ మోటార్, పవర్ కంట్రోలర్ వంటి సాంకేతిక భాగాలకు సాధారణంగా 3 సంవత్సరాల వరకు వారంటీ లభిస్తుంది.
స్కూటర్ బాడీ, లైట్లు, డిజిటల్ స్క్రీన్, వైరింగ్, లాకింగ్ సిస్టమ్స్ వంటి ఇతర భాగాలకు కంపెనీని బట్టి ఒకటి నుండి 3 సంవత్సరాల ప్రాథమిక వారంటీ ఉంటుంది. (అనంతపురం కేసులో ఓలా S1 ప్రో వాహనానికి 36 నెలలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ ఉంది).
కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయడం ఎలా? స్పష్టమైన మార్గదర్శకాలు
కంపెనీలు వారంటీ నిబంధనలను ఉల్లంఘించినా, లోపభూయిష్టమైన సేవలు అందించినా వినియోగదారులు కింది పద్ధతుల్లో చట్టపరంగా ముందుకెళ్లవచ్చు:
లీగల్ నోటీసు పంపడం:
సమస్య వచ్చినప్పుడు మొదట సర్వీస్ సెంటర్ను, ఈమెయిల్ ద్వారా కంపెనీని సంప్రదించాలి. అక్కడ స్పందన లేకపోతే, ఒక లీగల్ నోటీసును రిజిస్టర్డ్ పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా కంపెనీకి పంపాలి. నోటీసు అందిన 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించకపోతే కోర్టుకు వెళ్లే హక్కు లభిస్తుంది.
నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు:
వినియోగదారులు కన్జ్యూమర్ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం e-Daakhil (ఇ-దాఖిల్) పోర్టల్ (www.edaakhil.nic.in) ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేదా స్థానిక జిల్లా వినియోగదారుల కమిషన్లో నేరుగా పేపర్లు సమర్పించవచ్చు.
కోర్టును ఆశ్రయించాలి?
నష్టపరిహారం విలువ రూ. 50 లక్షల లోపు ఉంటే స్థానిక జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయాలి. వివాద విలువ రూ. 50 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు ఉంటే రాష్ట్ర రాజధానిలోని స్టేట్ కమిషన్ను ఆశ్రయించాలి.
జతచేయాల్సిన పత్రాలు:
ఫిర్యాదు చేసే సమయంలో వాహన కొనుగోలు బిల్లు (Invoice), వారంటీ కార్డు, సర్వీస్ సెంటర్కు తిరిగినట్లు చూపే జాబ్ కార్డ్స్, కంపెనీకి పంపిన ఈమెయిల్స్, లీగల్ నోటీసు కాపీ మరియు దానికి సంబంధించిన రశీదులను ఆధారాలుగా జతచేయాలి.
